
తెలంగాణకు చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.
ఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ ఢిల్లీ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాగారు ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతి, ఇందిరాశోభన్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాశోభన్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సౌత్ ఇండియా ఇన్ చార్జీ సోమ్ నాథ్ భారతిలకు ఇందిరాశోభన్ కృతజ్ఞతలు తెలిపారు.
పేద ప్రజలకు విద్యా, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అండగా నిలిచిన ఆప్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అన్ని విషయాల్లో జాతీయ పార్టీ నేతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు ఆమె వెల్లడించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఏడేళ్ల పాలనలో అధికార టీఆర్ ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని ఇందిరాశోభన్ విమర్శించారు. తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజా సమస్యలపై పోరాడటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ అంటే బడా జూటా పార్టీ అని పేర్కొన్నారు.
చదవండి: కేటీఆర్ కొడుకుపై పోల్ వ్యవహారం.. మల్లన్నపై బీజేపీ మండిపాటు, చర్యలు?