బీజేపీని బొంద పెట్టాలి: హరీశ్‌రావు 

Telangana: Harish Rao Comments Over BJP - Sakshi

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ అక్కాచెల్లెళ్లు ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు గ్యాస్‌ సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొందపెట్టాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్‌ మండలంలోని కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి, రాజపల్లి, శాలపల్లి, రాంపూర్, రంగాపూర్, చెల్పూర్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, ఈటల ఎంతసేపూ తనను పెంచి పెద్దచేసిన కేసీఆర్‌నే తిడుతున్నారు తప్ప, తాను చేసిన అభివృద్ధి మాత్రం చెప్పడం లేదని విమర్శించారు.

బీజేపీ బావుల కాడ మీటర్లు పెట్టమంటోందని.. అందుకు కేసీఆర్‌ ప్రాణం పోయినా ఒప్పుకోలేదని గుర్తుచేశారు. గెల్లును గెలిపిస్తే   పేదలకు ఇళ్లు కట్టిస్తానని.. సొంత జాగా ఉంటే రూ.ఐదు లక్షలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ఎప్పటిలాగే ఐకేపీ సెంటర్లు పెట్టి వడ్ల కొనుగోలు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ధరలు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్న పార్టీ బీజేపీ అని, కేసీఆర్‌ ఎకరానికి రూ.ఐదు వేలు కుడిచేత్తో ఇస్తే, ఎడమ చేత్తో డీజిల్‌ ధరలు పెంచి గుంజుకుం టున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు.

రెండున్నరేళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉంటుందని.. ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు ఉండాలన్నారు. బీజేపీ ఉద్యోగాలు ఊడగొడుతోందని, టీఆర్‌ఎస్‌ లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చిందని, త్వరలో మరో 60 నుం చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top