యాత్ర–2పై ఫేక్‌ జీఓ విడుదల చేసి రాక్షసానందం | TDP And Gang Circulates Fake GO On Yatra 2 Movie | Sakshi
Sakshi News home page

యాత్ర–2పై ఫేక్‌ జీఓ విడుదల చేసి రాక్షసానందం

Feb 9 2024 9:14 AM | Updated on Feb 9 2024 9:48 AM

TDP And Gang Circulates Fake GO On Yatra 2 MoVie - Sakshi

సాక్షి, అమరావతి :ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పచ్చ మీడియా బరితెగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా విభాగాలు రోజుకో రీతిలో విషం చిమ్ముతున్నాయి. తాజాగా ‘యాత్ర 2’ సినిమా పైనా ఈ తరహా దుష్ప్రచారానికి తెరతీశాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన పాదయాత్ర కథాంశంగా చేసుకుని నిర్మించిన ఈ సినిమాపై సహజంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇది చంద్రబాబు, పవన్‌లకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారి అనుచరులు ఆ సినిమా పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఓ ఫేక్‌ జీఓను సృష్టించి వైరల్‌ చేశాయి.

ఆ  సినిమాను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వలంటీర్లు తదితరులు మొదటి రెండు రోజులు చూసేలా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్టు ఆ ఫేక్‌ జీఓ సృష్టించారు. ప్రతి వలంటీర్‌ తమ పరిధిలో 10 మందిని సినిమాకు తీసుకురావాలని... అందుకోసం వారికి 10 సినిమా టికెట్లు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అందులో నిర్దేశించినట్టు చూపించారు.

రోజూ సినిమా కలెక్షన్లు ఎంతో కూడా కలెక్టర్లే లెక్కించి నివేదించాలని ఏడో తేదీన విడుదల చేసినట్టున్న ఆ జీఓలో పొందుపరిచారు. అయితే దీనిని సృష్టించిన పచ్చ సోషల్‌ మీడియా ఆ ఉత్తర్వులు విడుదల చేసినట్టు చూపించిన నీలం సాహ్ని ప్రస్తుతం సర్వీసులో లేరన్న విషయం గమనించలేదు. ఆమె రెండేళ్ల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేయగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయమూ కోరలేదు. కేవలం సినిమాపై ప్రతికూలత తీసుకువచ్చేందుకే పచ్చ మీడియా ఈ కుట్రకు పాల్పడింది. శుక్రవారం విడుదలైన సినిమా ఘన విజయం సాధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement