వరద సాయమేదీ?.. X మీకు మాట్లాడే హక్కు లేదు! | Sridhar Babu vs Minister KTR in Legislative Assembly | Sakshi
Sakshi News home page

వరద సాయమేదీ?.. X మీకు మాట్లాడే హక్కు లేదు!

Aug 5 2023 4:57 AM | Updated on Aug 5 2023 4:57 AM

Sridhar Babu vs Minister KTR in Legislative Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, వరదల నష్టం, బాధితులకు ఆర్థిక సాయం అంశాలపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధానికి దారితీసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తుండగా.. పలువురు మంత్రులు అడ్డుకున్నారు. దీంతో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్‌ వర్సెస్‌ శ్రీధర్‌బాబు అన్నట్టుగా వాదోపవాదాలు జరిగాయి. 

రైతులందరికీ పరిహారం ఇవ్వాలి.. 
బీఆర్‌ఎస్‌ సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి ఈ చర్చను ప్రారంభించారు. రైతులకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరారు. తర్వాత శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘వరదలతో జనజీవనం అతలాకుతలమైంది. 50 మంది మరణించారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్లు ఏ మాత్రం సరిపోవు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.1,500 కోట్లు రైతులకు చెల్లించాలి..’’అని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ జోక్యం చేసుకుంటూ..‘‘శ్రీధర్‌బాబు వరద నష్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. అవి తప్పుడు లెక్కలు. ఈసారి ఆలస్యంగానైనా వర్షాలు కురిసినందుకు ఆనందించాలి.

రెండు రోజులు నీళ్లున్నా వరికి నష్టం జరగదు. సోయా, పత్తి పంటలకు మాత్రమే నీళ్లుంటే నష్టం జరుగుతుంది. శ్రీధర్‌బాబు ఇదేదీ ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ రుణమాఫీ ప్రకటన చేయగానే కాంగ్రెస్‌ వాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలి. దు్రష్పచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అంతేగాకుండా.. రైతులకు మూడు గంటల కరెంట్‌ సరిపోతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాహాటంగా వ్యాఖ్యానించారని.. అలాంటి వారు తమకు నీతులు చెప్పడం ఏమిటని వ్యాఖ్యానించారు.

గతంలో 6 గంటల కరెంట్‌ ఇచ్చి రైతులను చావగొట్టారని.. ఇప్పుడు ధరణి రద్దు చేస్తామని, దళారీ ప్రభుత్వం తెస్తామని అంటున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలపై శ్రీధర్‌బాబు రైతాంగానికి క్షమాపణ చెప్తారా? అని నిలదీశారు.‘‘ఒకప్పుడు ఒకాయన (చంద్రబాబు) వ్యవసాయం దండుగ అన్నారు.. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ఉచిత విద్యుత్‌ వద్దంటున్నారు..’’అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

పరస్పరం మాటల తూటాలతో.. 
కేటీఆర్‌ మాట్లాడిన తర్వాత అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. వరదలపై సమాధానం చెప్పలేక కేటీఆర్‌ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని.. విద్యుత్‌పై ప్రత్యేక చర్చ పెడితే అందుకు తాము సిద్ధమని శ్రీధర్‌బాబు సవాల్‌ చేశారు. మధ్యలో భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. రైతులకు 3 గంటల కరెంట్‌ చాలని రేవంత్‌రెడ్డి అనలేదని స్పష్టం చేశారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తామన్నారు. సభలో ఉన్న బీఆర్‌ఎస్‌ సభ్యులు కూడా వీడియో చూపించాలన్నారు.

వాదోపవాదాలు సాగుతుండగానే శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. ‘‘వరదలతో వేల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మేటల తొలగింపు కోసం ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు అవుతుంది. వరదలకు ప్రకృతి వైపరీత్యంతోపాటు మానవ తప్పిదం కూడా కనిపిస్తోంది. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం శాస్త్రీయంగా లేదు. దీనిపై హౌస్‌ కమిటీ వేయండి. బాధితులకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారుకు ఇంకా మూడు నాలుగు నెలల సమయమే ఉందని, తర్వాత వచ్చేది తామేనని వ్యాఖ్యానించారు.

మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే. పగటి కలలు కనొద్దు’అని పేర్కొన్నారు. మధ్యలో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. ‘‘రేవంత్‌రెడ్డి 24 గంటల కరెంట్‌ వద్దు అంటున్నారు. చెక్‌డ్యామ్‌లు వద్దని శ్రీధర్‌బాబు అంటున్నారు. మరో కాంగ్రెస్‌ నేత ధరణి వద్దు అంటున్నారు. ఇదేనా కాంగ్రెస్‌ విధానం?’’అని విమర్శించారు. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని.. తాము చెక్‌డ్యామ్‌ లు వద్దనలేదని, శాస్త్రీయంగా నిర్మించలేదన్న విషయాన్ని స్పష్టం చేశామని పేర్కొన్నారు. దీంతో.. ‘‘ఇరిగేషన్‌ అధికారులు డిజైన్‌ చేసి అన్నిరకాలుగా అధ్యయనం చేశాకే చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తారు. అలాంటివి అశాస్త్రీయమని ఎలా అంటారు?’’అని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement