అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. | 'Didn't Enter Temple When...': Siddaramaiah Sparks Controversy Amid Sanatana Row - Sakshi
Sakshi News home page

Sanathana Dharma Row: అందుకే దేవాలయానికి వెళ్లలేదు.. సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..

Sep 7 2023 2:50 PM | Updated on Sep 7 2023 4:09 PM

Siddaramaiah Sparks Controversy Amid Sanatana Row - Sakshi

బెంగళూరు: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిని రాజకీయంగా విమర్శలకు గురిచేస్తున్న క్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. చొక్కా తీసేయాలని అడిగినందుకు కేరళలోని దేవాలయానికి తాను వెళ్లలేదని చెప్పారు. 

' ఒకానొకసారి కేరళలో ఓ దేవాలయానికి వెళ్లాను. ఆలయంలోకి ప్రవేశించాలంటే తాను చొక్కా తీసేయాలని కోరారు. నేను దేవాలయంలోకి వెళ్లడమే మానేశాను. గుడి బయట నుంచే ప్రార్థించాలని వారు నాకు చెప్పారు. నన్ను ఒక్కడినే చొక్కా తీసేయాలని కోరారు తప్పా అక్కడ ఉన్న ఎవ్వరినీ అడగలేదు. దేవుడి ముందు ఇది చాలా అమానవీయమైన పద్ధతి. భగవంతునికి అందరూ సమానమే.' అని సిద్ధరామయ్య చెప్పారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న నారాయణ గురు 169వ జన్మదిన ఉత్సవాల్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయంలోకి ప్రవేశించే ముందు చొక్కా తీసివేయడం ఆనవాయితీగా వస్తోంది. శరీరంపై చొక్కాకు బదులు భుజాల మీదుగా అంగవస్త్రాన్ని ధరిస్తారు. సాంప్రదాయంగా ఈ విధానం అమలులో ఉంది.    

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..
సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. 

ఇదీ చదవండి: ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్‌.... మోదీతో సహా బీజేపీ నేతలకు కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement