‘అంతా నా ఇష్టం’.. రాహుల్‌తో శశిథరూర్‌ | Shashi Tharoor refused party line over Operation Sindoor | Sakshi
Sakshi News home page

‘అంతా నా ఇష్టం’.. రాహుల్‌తో శశిథరూర్‌

Jul 28 2025 5:10 PM | Updated on Jul 28 2025 6:04 PM

Shashi Tharoor refused party line over Operation Sindoor

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. లోక్‌సభలో కొనసాగుతున్న ఆపరేషన్‌ సిందూర్‌పై పార్టీ తీసుకున్న లైన్‌కు అనుగుణంగా మాట్లాడలేనని.. తాను మొదటి నుంచి ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందనే మాటకు కట్టుబడి ఉన్నట్లు రాహుల్‌ గాంధీకి శశిథరూర్‌ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 

లోక్‌సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వంపై విమర్శలు చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేసింది. ఎంపీ శశి థరూర్‌ను సైతం పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని ఆదేశించింది.అయితే, శశి థరూర్‌ మాత్రం ఒప్పుకోలేదు. 

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే తన అభిప్రాయాన్ని మార్చలేనని శశిథరూర్‌ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ప్రభుత్వంపై విమర్శలు చేయమని కోరినప్పుడు.. ఆయన మౌనం (మౌనవ్రత్‌)వహించారు. ఈ క్రమంలో పార్లమెంటులోకి వచ్చే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియా ప్రశ్నలకు శశిథరూర్‌ మౌనవ్రత్‌, మౌనవ్రత్‌ అని అంటూ లోపలికి వెళ్లారు.  

అంతకు ముందు లోక్‌ సభలో ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ శశిథరూర్‌.. పార్టీ కార్యాలయంలో రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్‌ గాంధీ వద్ద పార్టీ తీసుకున్న నిర్ణయంపై  శశిథరూర్‌  విభేదించినట్లు సమాచారం. కాబట్టే పార్టీ పెద్దలు లోక్‌ సభలో శశిథరూర్‌కు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.

తాజా పరిణామంతో శశి థరూర్ తన స్వతంత్ర అభిప్రాయాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కలిగిస్తున్నారంటూ కాంగ్రెస్‌ హస్తిన పెద్దలు గుసగుసలాడుతున్నట్లు టాక్‌ నడుస్తోంది. 

 

Advertisement
 
Advertisement
Advertisement