పూర్తి కాకుండానే ’పాలమూరు’ను ప్రారంభిస్తారా? | Revanth Reddy Shocking Comments on CM KCR | Sakshi
Sakshi News home page

పూర్తి కాకుండానే ’పాలమూరు’ను ప్రారంభిస్తారా?

Sep 12 2023 2:40 AM | Updated on Sep 12 2023 7:37 AM

Revanth Reddy Shocking Comments on CM KCR - Sakshi

మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీతా దయాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ పాలనలో పాలమూరు వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పనులు పూర్తి కాకుండానే ఈనెల 16న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, ఈ ప్రాజెక్టులో మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం ఒక్క పంపును ప్రారంభిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందా అని ఎద్దేవా చేశారు.

సోమవారం గాందీభవన్‌లో  దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆమెను ఆహ్వనించిన అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ గతంలో సీతా దయాకర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారని, తొమ్మిదిన్నరేళ్లలో పాలమూరుకు కేసీఆర్‌ చేసిందేమీ లేదని విమర్శించారు.

ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగితే, ఇప్పుడున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలకు కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రాధాన్యత కలి్పస్తోందని, సీతాదయాకర్‌రెడ్డికి రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

కాంగ్రెస్‌లో చేరిన తిమ్మాపూర్‌ నేతలు 
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్‌ మండలానికి చెందిన పలువురు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్‌తో సహా పలువురు కార్యకర్తలను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కండువాకప్పి రేవంత్‌ పార్టీలోకి ఆహ్వనించారు.

Advertisement
 
Advertisement
Advertisement