మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ కౌంటర్‌​ | Rajnath Singh Slams Tejashwi Yadav | Sakshi
Sakshi News home page

మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ కౌంటర్‌

Apr 14 2024 5:41 PM | Updated on Apr 14 2024 6:46 PM

Rajnath Singh Slams Tejashwi Yadav - Sakshi

పాట్నా: మీరు చేప, ఏనుగు లేదా గుర్రాన్ని తినండి. ఇలా చూపించడం ఎందుకు? అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల్ని జైల్లో పెట్టిస్తాంటూ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన ఏడుగురు కుమార్తెల్లో ఒకరైన పాటలీపుత్ర లోక్‌సభ అభ్యర్ధి మిసా భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

బీహార్‌లో ఎన్నికల ప్రచారం
ఈ తరుణంలో అలయన్స్‌లో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్‌ పాశ్వాన్‌ వర్గం తరుపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. బీహార్‌లోని జమూయిలో ఎన్డీయే అభ్యర్థి, ఎల్జేపీ (రామ్ విలాస్) పార్టీ నేత అరుణ్ భారతికి మద్దతుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రసంగించారు.   

మాంసాహారం తింటూ వీడియోలు 
ఈ సందర్భంగా ఆర్‌జేడీ నేత, లాలూ ప్రసాద్‌ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘కొంతమంది నాయకులు ఓ వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నవరాత్రుల సమయంలో మాంసాహారం తింటున్న వీడియోల్ని పోస్టు చేశారని’ ఆరోపించారు. 

మీరు తినే తిండి మాకు చూపించడం ఎందుకు?
‘నవరాత్రులలో చేపలు తింటున్నావు. ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు. చేప, పంది, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను. ఇందులో చూపించాల్సిన అవసరం ఏముంది. ఇది ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసమేనని దుయ్యబట్టారు. ఇలా చేస్తే ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓటు వేస్తారని భావిస్తున్నారు అని ఆరోపించారు.  

మోదీని జైల్లో వేస్తారా?
లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను తన స్నేహితుడంటూ.. ఆయన కుటుంబ సభ్యులు.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోదీని జైల్లో పెడతామని చెబుతున్నారు. జైల్లో లేదా బెయిల్‌పై ఉన్నవారు మోదీని జైలుకు పంపిస్తారా? బీహార్ ప్రజలు అన్నింటినీ సహిస్తారు, కానీ ఇది కాదు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

మరోసారి మోదీయే ప్రధాని 
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోందని, వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ఇతర దేశాలు ఆయనను ఆహ్వానించడం ప్రారంభించాయని,ఈ ఎన్నికలను లాంఛనప్రాయంగా చూస్తున్నారని తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసిస్తూ, యువ నాయకుడు ఎన్‌డీయే పిచ్‌పై రన్ హిట్టర్ అని, అవసరమైనన్ని పరుగులు చేస్తారని కొనియాడారు. రామ్ విలాస్ పాశ్వాన్ కలలను ఆయన నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.

Advertisement
 
Advertisement
Advertisement