కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రాజ్యాంగ సవరణ బిల్లు
వీగిపోవడంతో ఈసారి ముందస్తు వ్యూహంతో బరిలోకి బీజేపీ
ప్రజాసమస్యలపై నిలదీసేందుకు సిద్ధమవుతున్న విపక్షాలు
లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి భంగపడిన అధికార ఎన్డీఏ కూటమి ఈసారి మరింత పదునైన వ్యూహంతో ముందుకొస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కార్ కృతనిశ్చయంతోఉంది. అయితే బడ్జెట్ సమావేశాల్లో ఐక్యత చాటి మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినట్లే ఈసారి ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.
దీంతో జూలై 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీదాకా ఈసారి వర్షాకాల సమావేశాలు వ్యూహప్రతివ్యూహాలతో హోరాహోరీగా సాగనున్నాయి. మొత్తంగా ఈసారి 19 సార్లు ఇరుసభలు సమావేశంకానున్నాయి. బడ్జెట్ సెషన్లో మహిళా రిజర్వేషన్ చట్టసవరణ బిల్లును వీగిపోయేలా చేసినప్పటికీ ఇప్పటికీ అధికార, విపక్షల బలాబలాల్లో మార్పులొచ్చాయి.
ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిన 27 స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిచి ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంది. వీళ్లుగాక స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు, చిన్న పార్టీల మద్దతునూ కూడగడుతోంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం 150కి చేరుకోబోతోంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల సంఖ్యాబలం(160)కి సమీపంలో ఉండటం గమనార్హం. పశ్చిమబెంగాల్లో ఖాళీగాఉన్న మరో మూడు రాజ్యసభ స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ తన సంఖ్యాబలాన్ని మరింత పెంచుకోనుంది. దీంతోపాటు లోక్సభలోనూ బీజేపీ బలం ఎక్కువకానుంది.
తగ్గిన విపక్షాల బలం
ఇటీవల వెలువడిన పలు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల తర్వాత విపక్ష పార్టీల సంఖ్యాబలం తగ్గిపోయింది. దీంతో విపక్ష పార్టీల మధ్య ఐక్యత సైతం బలహీనపడింది. తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన అధికార పగ్గాలు చేపట్టిన విజయ్ జోసెఫ్కు చెందిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సుతరామూ ఇష్టంలేని మిత్రపక్షం డీఎంకే తన మైత్రిబంధానికి చరమగీతం పాడింది. వీటికితోడు పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీని షాక్కు గురిచేస్తూ 20 మంది టీఎంసీ ఎంపీలు సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకి మద్దతు పలికారు. ఈ పార్టీ ఇప్పటికే ఎన్డీఏకూ మిత్రపక్షంగా ఉంది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రేకు గుబ్బై చెప్పి ఆరుగురు శివసేన(యూబీటీ) ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు పలకడంతో లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏ మరింత బలం పుంజుకుంది.
విపక్షాల నుంచి సవాళ్లు..
ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, సీబీఎస్ఈ పన్నెండో తరగతి విద్యార్థుల డిజిటల్ మూల్యాంకనం తప్పులతడకగా మారడం, అయోధ్యలోని రామమందిరానికి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు, స్వర్ణాభరణాలు చోరీకి గురికావడం, దేశంలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని తాకడం, పశ్చిమాసియా యుద్ధాగ్ని జ్వాలల భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సెగలు పుట్టించడంతో ప్రభుత్వ అంతర్గత, విదేశాంగ విధానం విఫలమైందంటూ విపక్షాలు పార్లమెంట్ వేదికగా పదునైన విమర్శనాస్త్రాలు సంధించనున్నాయి. టీఎంసీ, శివసేన(యూబీటీ) తిరుగుబాటుఎంపీల మద్దతులో లోక్సభలో ఎన్డీఏ బలం 318 లేదా 319కి పెరిగే వీలుంది. అయినాసరే మూడింట రెండొంతుల(360) బలానికి బీజేపీ 40 స్థానాలను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, నివేదికలు..
ఢిల్లీలో అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ కట్టలు వెలుగుచూసిన ఉదంతంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంతవర్మను పదవి నుంచి తొలగించేందుకు, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ తన నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఈ అంశంలో అధికార, విపక్షాలు ఏకతాటిమీదకొచ్చాయి.
ఇవీ బిల్లులు..
1. రాజ్యాంగ(130వ) సవరణ బిల్లు
తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టయి ఏకధాటిగా 30 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండిపోయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లు సభ ముందుకురావొచ్చు. అయితే ఇప్పటికే ఈ బిల్లు సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
2. విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు, 2026
ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
3. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు
గత ఏడాది డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
4. సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు, 2025
ఈ బిల్లును 2025 డిసెంబర్ 18వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.
5. కార్పొరేట్ చట్టాల(సవరణ)బిల్లు, 2026
2026 మార్చి 23వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది.


