కారుకు తోడుగా ‘రైతుబంధువులు’  | The presidents of Rythu Bandhu Samiti are coordinating | Sakshi
Sakshi News home page

కారుకు తోడుగా ‘రైతుబంధువులు’ 

Nov 23 2023 5:09 AM | Updated on Nov 23 2023 2:48 PM

The presidents of Rythu Bandhu Samiti are coordinating - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతుబంధు సమితి సభ్యులు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. రైతుబంధు పంపిణీ, రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు... ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి.

విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది కూడా వీళ్లే.

ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ, ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రైతుబంధు సొమ్ము రూ.75 వేల కోట్లు రైతులకు చెల్లించినట్లు వారు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు.  

1.61 లక్షల మంది సభ్యులు... 
రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వపరంగా నామినేట్‌ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా అన్ని మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమస్వయకర్తను నియమించారు.

వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలోనూ సమన్వయ సమితి పనిచేస్తుంది. రాష్ట్ర రైతుబంధు సమితికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చైర్మన్‌గా నియమించి, కేబినెట్‌ హోదా కల్పించారు. అంతకుముందు దీనికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చైర్మన్లుగా పనిచేశారు. నామినేట్‌ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా బీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు వీరందరినీ సమన్వయం చేసుకుంటూ తాటికొండ రాజయ్య పర్యవేక్షిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి బీఆర్‌ఎస్‌కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. కాగా, ప్రసుతం వీరికి రెమ్యునరేషన్‌ లేదు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్‌ రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. 

-బొల్లోజు రవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement