ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్‌ | Opposition slams VIP welcome to deputy minister amid Jhansi hospital tragedy | Sakshi
Sakshi News home page

ఝాన్సీ ఆసుపత్రి విషాదం.. డిప్యూటీ సీఎంకి వీఐపీ వెలకమ్‌

Nov 16 2024 5:17 PM | Updated on Nov 16 2024 5:27 PM

Opposition slams VIP welcome to deputy minister amid Jhansi hospital tragedy

ఉత్తర ప్రదేశ్‌‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మంటలు వ్యాపించి పది మంది నవజాత శిశువులు సజీవదహనమవ్వడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. 

ఈ విషాదం వేళ ఆస్పత్రికి వర్గాలు వ్యవహరించిన తీరుపై విమర్శలకు దారితీసింది. ఝాన్సీ ఆసుపత్రికి ఉప ముఖ్యమంత్రి బ్రజేష్‌ పాఠక్‌ వస్తున్నారని తెలిసి... ఆయన రాక ముందే సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి, సున్నం చల్లడం వంటి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై విరుచుకుపడింది. బీజేపీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టింది.

ఓవైపు అగ్నిప్రమాదంలో చిన్నారులు మృత్యువాత పడి.. వారి  కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. మరోవైపు ఉప ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు రోడ్లు శుభ్రం చేసి, సున్నం చల్లుతున్నారంటూ కాంగ్రెస్‌ మండిపింది. . అప్పటి వరకు మురికి కూపంలా ఉన్న ఆస్పత్రి ఆవరణను డిప్యూటీ సీఎం రాక వేళ శుభ్రం చేశారని స్థానికులు తెలిపినట్లు పేర్కొంది. మంటల్లో చిన్నారులు చనిపోతే.. ఈ ప్రభుత్వం తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని, ఇది సిగ్గుచేటని మండిపడింది.

యూపీలోని ప్రభుత్వ ఆస్పత్రులు అవినీతికి, నిర్లక్ష్యానికి నిలయాలుగా మారాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. చిన్నారులను రక్షించడానికి ఆస్పత్రిలో ఎలాంటి ఏర్పాట్లూ లేవని ఆరోపించింది. ప్రజలు చనిపోతున్నా ఆ పార్టీకి ఏమీ పట్టదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జుహీ సింగ్‌ విమర్శించారు. 

కాగా ఆసుపత్రి ఐసీయూలో ఒక్కసారిగా మంటల వ్యాపించడంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితేవిద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.  ఈ దుర్ఘటనలో పది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే మంటలు చెలరేగిన వార్డులో గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు కనిపించడంతో పాటు సేఫ్టీ అలారాలు కూడా మోగలేదు. 2020లో ఎక్స్‌టింగ్విషర్ల గడువు ముగిసినట్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement