
కామారెడ్డి జిల్లా: కాంగ్రెస్ తాటాకుచప్పుళ్లకు భయపడేది లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బాన్సువాడలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో పింక్ బుక్ పేరిట ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దంటూ కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్లో రాసుకుంటాం, బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.
‘‘బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ. మాట తప్పడమే.. మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారు.
..ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్ల పాటు అరిగోస పెట్టింది కాంగ్రెస్. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు కారణం కాంగ్రెస్. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలి’’ అంటూ కవిత పిలుపునిచ్చారు.