ఇందల్వాయి: మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్యకు కారకులైన వారిని వదలబోమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి దారుణహత్యకు గురైన ఇమ్మడి గోపి మృతదేహం పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామం లింగాపూర్కు చేరుకుంది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి లింగాపూర్కు చేరుకొని గోపి మృతదేహానికి నివాళులర్పించి, అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులకు శిక్షపడేలా చూడాలని అన్నారు. రాజకీయ కక్షల కారణంగా హింసను ప్రేరేపించడం సహించబోమని అన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. కాగా, విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
● ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● ఇమ్మడి గోపి కుటుంబానికి పరామర్శ


