ఖమ్మం: భూ సమస్యల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ భారతి ద్వారా రైతన్నల భూములకు పూర్తి భద్రత కల్పిస్తామని, గ్రామసభల ద్వారా భూ రికార్డులను పారదర్శకంగా సరిదిద్దుతున్నామన్నారు. ప్రతి జిల్లాలో నేరుగా సమస్యల పరిష్కారం.. తానే స్వయంగా అన్ని జిల్లాలకు వెళుతానన్నారు. భూభారతి చట్టం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని, ఇది ప్రారంభించినప్పుడే చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు భూభారతిని రెఫరెండమన్నారు మంత్రి.
ఈరోజు(గురువారం, ఆగస్టు 20వ తేదీ) సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ పరిధిలో నారాయణపురం గ్రామంలో భూభారతి భూ రీ సర్వే అవగాహన సదస్సులో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి,
‘ఇది పేదవాడి కష్టం తెలిసిన ప్రజా ప్రభుత్వం. ప్రతిపక్షాల విమర్శలకు భయపడేది లేదు. 22-ఏ ద్వారా అక్రమ ఆస్తులను రెగ్యులరైజేషన్ చేసుకోవాలన్న కొందరి తపన కలగానే మిగిలిపోతుంది. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధత ఏంటో ప్రజలందరికీ తెలుసు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 'ఎస్ఈటీ'ని ఏర్పాటు చేసింది.
కుటుంబ సభ్యులను ముందుపెట్టి డ్రామాలు చేసే బదులు..రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టేలా సొల్లు పురాణాలు చెప్పడం ఇకనైనా బంద్ చేయాలి. ఇది పేదవాడి కష్టం తెలిసిన, పేదలకు అండగా నిలిచే ప్రజా ప్రభుత్వం. రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రభుత్వానికి ప్రజలు మరోసారి తీర్పునిచ్చి తమ రెఫరెండం చూపుతారు.’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు: కొండా సురేఖ


