ఎన్నికలంటే చంద్రబాబుకు భయం: మంత్రి అంబటి

సాక్షి, పల్నాడు జిల్లా: ఎన్నికలంటే చంద్రబాబు భయపడుతున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
చదవండి: ‘ముసుగు తొలగింది.. టెంట్ హౌస్ పార్టీ మరోసారి అద్దెకు సిద్ధం’
‘‘ఎన్నికలంటే భయపడాల్సిన అవసరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గడిచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఎన్నికలకు భయపడే పొత్తు పెట్టుకోండంటూ చంద్రబాబు అందరి కాళ్లవేళ్ల పడుతున్నాడు. చంద్రబాబు తన జడ్ ప్లస్ సెక్యూరిటీ తీసేసి బయటికి వస్తే గతంలో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆయన్ని మహిళలు చెప్పుతో కొడతారు.
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. 95 శాతం హామీలు అమలు చేశాం. కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయాలు పడిపోయినా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని’’ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.