
సాక్షి, వైఎస్సార్: టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డిపై మేయర్ సురేష్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో ఒక్క పనైనా చేశారా?.. అభివృద్ధి గురించి వారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలే వారిని చూసి అసహ్యించుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.
కడపలో మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ నాయకుడు శ్రీనివాసులు రెడ్డి అవినీతి భాగవతం గురించి టీడీపీ వారే చర్చించుకుంటున్నారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో తెలుసు. 30లక్షల పనికి మూడు కోట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవమా కాదా?. మీ కార్యకర్తలే నీ అవినీతి బాగోతం గురించి చర్చించుకుంటున్నారు అయినా సిగ్గు లేదా!. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మాధవీ రెడ్డి కడపకు ఎంత మేర నిధులు తెచ్చారో చెప్పే దమ్ము, దైర్యం ఉందా?. మా నిధులతో టెంకాయలు కొట్టడానికి సిగ్గుగా అనిపించడం లేదా?. వేల కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైఎస్సార్సీపీది. అవినీతి చేసే మీరా మమ్మల్ని విమర్శించేది. కాలర్ ఎగరేసుకొని ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తాం.
ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ ఇచ్చి గౌరవిస్తే ఆమె నియంతలా వ్యవహరించారు. సర్వసభ్య సమావేశంలోనే సాటి మహిళను ఆమె అవమానించారు. కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నానని మాట్లాడటానికి సిగ్గు పడాలి. కుర్చీ కోసం ప్రాకులాడేది ఎవరో ప్రజలకు తెలుసు. అభివృద్ధి కోసం కాదు కుర్చీ కోసమే ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఆరాటం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన అజెండాను చించి వేశారు మాధవీ రెడ్డి. ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అభివృద్ధి నిరోధకులు కాదా?. 15వ ఫైనాన్స్ నిధులు కూడా రాకుండా చేసింది మీరు కాదా?. అవినీతి జరిగింది అని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. అలా నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అని ప్రశ్నించారు.