తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌ | KTR Slams Congress Govt For Misleading Telangana On State Debt Figures, Check His Tweet Inside | Sakshi
Sakshi News home page

తెలంగాణ అప్పుల చిట్టా విప్పిన కేటీఆర్.. కాంగ్రెస్‌పై ప్రివిలేజ్‌ మోషన్‌

Dec 16 2024 8:37 AM | Updated on Dec 16 2024 11:54 AM

KTR Slams Congress Govt for Misleading Telangana on State Debt Figures

సాక్షి,తెలంగాణ భవన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.  

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అప్పులపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందని, కేసీఆర్‌ రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారంటూ’ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు ఖండిస్తున్నారు. అప్పుల అంశంపై సోమవారం కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.  

‘ రాష్ట్ర అప్పులు రూ. 7 లక్షల కోట్లంటూ అసెంబ్లీని, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం పదే పదే చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మేము ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెడతాం. ఆర్‌బీఐ  నివేదిక ప్రకారం అప్పు రూ. 3.89 లక్షలు మాత్రమే అని పేర్కొంది. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులంటూ ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం ‘ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’ నివేదిక తేల్చిందని అన్నారు.

ఆర్థిక మంత్రి భట్టి అప్పు లపై చేసిన ప్రసంగాన్ని ఖండించిన కేటీఆర్...

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు.  కావున తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు  సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’ అని ట్విట్‌లో పేర్కన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement