Munugode: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’
Published
Wed, Aug 31 2022 4:22 PM
Munugode Politics.. సాక్షి, యాద్రాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో గులాబీ నేతలు ప్లాన్స్ రచిస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ సైతం మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీలోకి చేరికలపై దృష్టిసారించారు. కాగా, బుధవారం చౌటుప్పల్ మండలం, తుఫ్రాన్పేట్లో కార్యకర్తలు.. రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి.. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘నా రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ బూటకపు మాటలపైన ప్రజలకు నమ్మకం పోయింది. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గుచూపుతున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉంది’ అని తెలిపారు.