తలవంచేది లేదు.. ఎన్నికల్లో నిలబడతా: తుమ్మల | Khammam Tummala Nageswara Rao Decision On Party Change - Sakshi
Sakshi News home page

తలవంచేది లేదు.. ఎన్నికల్లో నిలబడతా: తుమ్మల ప్రకటన

Published Fri, Aug 25 2023 6:01 PM

Khammam Thummala Nageswara Rao Decision On Party Change - Sakshi

సాక్షి, ఖమ్మం: గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేదాకా రాజకీయాల్లో ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుచరుల్ని ఉద్దేశించి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజల కోసం తాను పోటీ చేసి తీరతానని తుమ్మల ప్రకటించారు. శుక్రవారం వెయ్యి కార్లు, రెండు వేల బైకుల భారీ కాన్వాయ్‌తో ఖమ్మంలో అనుచరులు ఆయనకు ఘన స్వాగతం పలకగా.. ఊహాగానాలకు తెర తీస్తూ ఎన్నికల్లో పోటీపై ప్రకటన చేశారు.  

శ్రీ రాముడి ఆశీస్సులు తో పది నియోజకవర్గం లో అందరు చిరు నవ్వు తో బతకాలని 40 సంవత్సరాలు పాటు అందిరికి సౌకర్యాలు కోసం జీవితాన్ని త్యాగం చేశా. మొన్న ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎంకు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను. నాగలి దున్నుకునే వాడిని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేశారు. మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చిన ప్పుడు నన్ను కాపాడారు. గోదావరి జలాలు తో మీ పాదాలు కడిగేంత వరకు ఎంఎల్ఏ గా ఉంటా. నా చేతులు తో పాలేరు , వైరా, బేతుపల్లి లో కానీ ఉమ్మడి జిల్లాలో నింపి మీకు దూరం అవుతా. 

మీ కోసమే రాజకీయ జీవితం తప్ప.. నాకు పాలిటిక్స్‌ అవసరం లేదు. నాకు పదవి అధిపత్యం కోసం కాదు. నన్ను తప్పించానని కొందరు శునకానందం పొందుతున్నారు. ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్పా.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. ఎక్కడా తలవంచేది లేదు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. మీ కీర్తి కోసం ఆత్మాభిమానం కోసం నిలబడుతా. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా. అసలైన పనులు పూర్తి చేసి .. మీతో శెభాష్‌ అనిపించుకుంటా అని అనుచరుల్ని ఉద్దేశించి పేర్కొన్నారాయన.

అయితే తన ప్రకటనలో ఎక్కడా బీఆర్‌ఎస్‌పైగానీ..  కేసీఆర్‌పైగానీ అసంతృప్తి ‍ వ్యక్తం చేయని తుమ్మల.. పార్టీ మార్పుపై నుంచి గానీ, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే(పాలేరు నుంచేనా) అనే దానిపైనా స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.


Advertisement

తప్పక చదవండి

Advertisement