‘నితీష్‌, బీజేపీకి బిహార్‌ ప్రజలు బుద్ధి చెబుతారు’ | Nitish Resignation Not Affect INDIA Alliance Says Jairam Ramesh - Sakshi
Sakshi News home page

‘నితీష్‌, బీజేపీకి బిహార్‌ ప్రజలు బుద్ధి చెబుతారు’

Jan 28 2024 3:28 PM | Updated on Jan 28 2024 3:39 PM

Jairam Ramesh Says Nitish resignation Not Affect INDIA Alliance - Sakshi

ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై నితీష్ వైదొలటం ఎలాంటి  ప్రభావాన్ని చూపదు..

జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌ మహాకుటమి నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీతో జట్టు కట్టి ఆదివారం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  నితీష్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జును స్పందిస్తూ.. బిహార్‌లో ఇటువంటి పరిస్థితి వస్తుందని.. జేడీ(యా) చీఫ్‌ నితీష్‌ కుమార్‌ మహాకూటమి నుంచి వైదొలుగుతారని ముందే ఊహించినట్లు తెలిపారు.

అయితే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ జైరాం రమేష్‌ మాత్రం నితీష్.. బీజేపీలో చేరటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి  ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా  కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై నితీష్ వైదొలటం ఎలాంటి  ప్రభావాన్ని చూపదని అన్నారు. 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్‌ ప్రజలు నితీష్‌ కుమార్‌, ఢిల్లీలో(బీజేపీ) వారికి  ఖచ్చితంగా తమదైన శైలిలో బుద్ధి చెబుతారని తెలిపారు. నితీష్‌ కుమార్‌ వంటి పచ్చి రాజకీయ అవకాశవాదిని తానెప్పుడూ చూడలేదని తీవ్రంగా మండిపడ్డారు.

అవకాశవాదంలో ఊసరవెల్లితోనే ఆయన పోటీ  పడ్డారని ఎద్దేవా చేశారు.  ఈ వ్యవహారం అంతా  ప్రధాని మోదీ డైరెక్షన్‌లో నడుస్తోందని మండిపడ్డారు. ఇక.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ సాధిస్తున్న విజయం పట్ల బీజేపీకి భయం కలుగుతోందని అన్నారు. అందుకే కూటమిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక.. నితీష్‌ కుమార్‌ నేడు సాయంత్రం 4 గంటలకు మరోసారి బిహార్‌ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం కానున్న నితీష్‌.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు , స్పీకర్‌ పదవిని కేటాయిస్తారని తెలుస్తోంది.

చదవండి:  అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్

Advertisement
 
Advertisement
Advertisement