గ్యాస్‌ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా.. | CM Stalin announces Rs 2 per unit subsidy to eateries | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరత వేళ హోటళ్లు, టీ స్టాళ్లు మూత పడకుండా..

Mar 14 2026 4:33 PM | Updated on Mar 14 2026 4:42 PM

CM Stalin announces Rs 2 per unit subsidy to eateries

చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్‌ కొరత నెలకొనడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, హాస్టళ్ల వంటి వాటిని నడపలేని పరిస్థితి వస్తోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీలను వాడకుండా విద్యుత్ స్టౌలను వాడుకోవాలని.. ఇలా చేసే హోటళ్లు, టీ స్టాళ్ల వంటివాటికి విద్యుత్‌ బిల్లులో యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.

తమిళనాడులో ఏర్పడిన ఎల్పీజీ కొరత వల్ల పరిశ్రమలు, ఫుడ్‌ సెక్టార్‌ సహా అనేక రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించేందుకు శనివారం తమిళనాడు సచివాలయంలో స్టాలిన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. హోటళ‍్ల వంటివాటిలో కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జె.రాధాకృష్ణన్ వివరాలు తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.

‘గ్యాస్‌ కొరత సమయంలో ఎల్పీజీలు వాడకుండా విద్యుత్ స్టౌలను వాడడం ప్రారంభించే హోటళ్లు, రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు, ఇతర ఆహార తయారీ యూనిట్లు.. అదనంగా వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ వినియోగంపై విధించిన పరిమితులు అమల్లో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమిళనాడులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించేందుకు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదేశించారు. అర్హత ఉన్న వ్యాపారులు రూ.3.75 లక్షల వరకు రుణాలకు 25 శాతం సబ్సిడీ పొందవచ్చు. మహిళా వ్యాపార అభివృద్ధి పథకం కింద మహిళలు నడిపే వ్యాపారాలకు రూ.10 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా రూ.2 లక్షలపై 25 శాతం సబ్సిడీ ఇస్తారు.

అదనంగా ఎస‍్సీ, ఎస్టీ వ్యాపారులను ప్రోత్సహించేందుకు అన్నై అంబేడ్కర్ బిజినెస్ ఛాంపియన్స్ పథకం కింద గరిష్ఠంగా రూ.కోటి వరకు 35 శాతం మూలధన సబ్సిడీ ఇస్తారు. అధిక సామర్థ్య విద్యుత్ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. తమిళనాడులో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో 60,698 కర్మాగారాలు ఎల్పీజీ, సీఎన్‌జీ, డీజిల్, ఫర్నేస్ ఆయిల్, కట్టెలు వంటి వాటిని  ఉపయోగిస్తూ పనిచేస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement