ఈశాన్యంలో శాంతి వీచికలు | PM Modi to inaugurate and lay foundation stone for multiple development projects in Assam | Sakshi
Sakshi News home page

ఈశాన్యంలో శాంతి వీచికలు

Mar 14 2026 2:18 AM | Updated on Mar 16 2026 5:01 PM

PM Modi to inaugurate and lay foundation stone for multiple development projects in Assam

బీజేపీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పరుగులు  

అస్సాం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి 

రూ.19,680 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి 22వ విడత సొమ్ము విడుదల  

గువాహటి: ఒకప్పుడు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లిన ఈశాన్య భారతదేశంలో నేడు శాంతి పవనాలు వీస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇక్కడ అశాంతి అంతమై, అభివృద్ధి పరుగు ఆరంభమైందని స్పష్టంచేశారు. ఈశాన్య ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో స్వార్థ రాజకీయాల కోసమే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం అస్సాంలో పర్యటించారు. మౌలిక సదుపాయాలు, ఇంధన రంగాల్లో రూ.19,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మరికొన్ని ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అలాగే పీఎం–కిసాన్‌ సమ్మాన్‌ నిధి 22వ విడత కింద దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేశారు.

కోక్రాఝార్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాజధాని గువాహటి నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రతికూల వాతావరణం వల్ల ప్రధానమంత్రి కోక్రాఝార్‌కు చేరుకోలేకపోయారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వ పాలనలో అస్సాంలో నూతన అధ్యాయం మొదలైందని, ఇక్కడ పూర్తిస్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని, శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జాతీయ భద్రతను పణంగా పెట్టిందని, స్థానికుల భూములను చొరబాటుదారులకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నా  
అస్సాంలో తేయాకు తోటల కార్మికులకు జరిగిన అన్యాయాన్ని తాము సరిదిద్దినట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భూములపై వారికి హక్కులు కల్పించామని, పట్టాలు అందజేశామని అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా మూడు కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళా కార్మికురాలికి మోదీ పాదాభివందనం చేశారు. కార్మికులకు న్యాయం చేసినందుకు హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వాన్ని అభినందించారు. అస్సాం కార్మికులు పండించిన తేయాకు గుజరాత్‌కు వస్తోందని, అక్కడ ఆ తేయాకుతో తేనీరు తయారు చేసి విక్రయించానని తెలిపారు. ఛాయ్‌వాలాగా పనిచేసి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. భూమి పట్టాలు ఇవ్వడం ద్వారా తేయాకు కార్మికుల రుణం తీర్చుకుంటున్నానని స్పష్టంచేశారు.    

కాంగ్రెస్‌ది అబద్ధాల దుకాణం  
ప్రేమ దుకాణం(మొహబ్బత్‌ కీ దుకాణ్‌) తెరిచామంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని ప్రధానమంత్రి తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ అబద్ధాల దుకాణం(ఝూటే వైదో కీ దుకాణ్‌) తెరిచిందని విమర్శించారు. అక్కడ ఒక అబద్ధానికి మరో నాలుగు సూపర్‌ అబద్ధాలు బహుమతిగా లభిస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఏనాడూ లేదన్నారు. హామీలు నిలబెట్టుకోవడమే లక్ష్యంగా డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement