తప్పుడు ప్రచారం మానుకోవాలి | Harish Rao Fires on Minister Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారం మానుకోవాలి

Jun 8 2025 4:59 AM | Updated on Jun 8 2025 4:59 AM

Harish Rao Fires on Minister Uttam Kumar Reddy

మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు హితవు

కాళేశ్వరంపై వాస్తవాలు వివరించినా ఆయన అబద్ధాలు ఆపట్లేదని ఆగ్రహం

కమీషన్ల కోసం కాంగ్రెస్‌ తొలుత టెయిల్‌ వర్క్స్‌ చేపట్టి హెడ్‌ వర్క్స్‌ వదిలేసిందని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరంపై వాస్తవాలు వివరించినా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని ఆపడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌పై స్పందిస్తూ మంత్రి ఉత్తమ్‌ చేసిన విమర్శలను హరీశ్‌రావు ఖండించారు. ‘ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు మాత్రమేనని చెబుతున్న ఉత్తమ్‌.. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు లిఫ్ట్‌ చేసిన నీటి వివరాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల వివరాలు దాచిపెడుతున్నారని విమర్శించారు.

కాళేశ్వరం కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది మేడారం పంప్‌హౌస్‌ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఎత్తిపోశామన్నారు. మంత్రికి తెలియకుంటే ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా తొలి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదనే విషయంతోపాటు కాల్వలు తవ్వుతున్నకొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు.

ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, కల్వకుర్తి దేవాదుల సహా ఏ ప్రాజెక్టులో అయినా మొదట హెడ్‌ వర్క్స్‌ పూర్తి చేసి టెయిల్‌ వర్క్స్‌ తర్వాత పూర్తి చేస్తుంటారని.. కానీ కాంగ్రెస్‌ మాత్రం కమీషన్ల కోసం తోక పనులు ముందు మొదలుపెట్టి, హెడ్‌ వర్క్స్‌ వదిలి పెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. తలాతోక లేని మాటలు మానుకొని అబద్ధాల ప్రచారం మానాలని హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement