విశాఖ ఇమేజ్‌ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన | Sakshi
Sakshi News home page

విశాఖ ఇమేజ్‌ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన

Published Fri, Aug 21 2020 4:08 AM

Gudivada Amarnath Fires On TDP Leader Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీయాలనేదే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆలోచనని, అందుకే విషం చిమ్ముతున్నారని, విశాఖపై ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. గురువారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ప్రకటన చేసినప్పటి నుంచి చంద్రబాబు విశాఖపై ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారని ఆరోపించారు.

ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..  
► విశాఖను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబుది. హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ను, హెచ్‌సీఎల్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేద్దామని చూశారు. 
► రైల్వే జోన్‌ కోసం ఈ ప్రాంత ప్రజలు పోరాడుతుంటే... గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావులతో వద్దంటూ కేంద్రానికి లేఖలు రాయించారు. 
► సమ్మిట్ల ద్వారా తెచ్చానంటున్న రూ.20 లక్షల పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో వెతికి పెట్టండి. 
► విశాఖలో రాజధాని రాకూడదనే కుట్రతో అమోనియం నైట్రేట్‌ నిల్వలపై చంద్రబాబు మాట్లాడటం ప్రజలను భయకంపితుల్ని చేయడమే. 
► 2015లో మీ హయాంలో విశాఖలో జరిగిన భూకుంభకోణాలపై మీ గెజిట్‌పత్రికల్లోనే పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. వాటి గురించి మరచిపోయారా?   
► ఇక్కడి అభివృద్ధి అంతా నాడు వైఎస్సార్‌ హయాంలో జరిగింది. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ సారథ్యంలో జరుగుతోంది.  
► అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్‌. మైసూర్‌ బోండా తరహాలో అమరావతిలో బాబు కట్టిన రాజధాని కనిపించదు. 
► అంతర్జాతీయ అమరావతిని నిర్మిస్తే.. ఆ ప్రాంత పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో లోకేశ్‌ సహా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారో చెప్పాలి. 
► నాగార్జున వర్సిటీ పరిసర ప్రాంతంలోని పంటలు పండని భూములను గ్రీన్‌జోన్‌లో, పంటలు పండే తుళ్లూరు, మందడం ప్రాంతాలను నాన్‌ అగ్రికల్చర్‌ జోన్‌లో పెట్టడం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదా..? స్కామ్‌ కాదా..? 
► కరోనాతో అందరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తుంటే... చంద్రబాబు స్టేట్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. చంద్రబాబు జూమ్‌ యాప్‌లో... కొడుకు లోకేశ్‌ ట్విట్టర్‌లోనే కనిపిస్తున్నారు. చివరికి టీడీపీని ‘జూమ్‌–ట్విట్టర్‌’ పార్టీగా మార్చేశారు.  
► చంద్రబాబు నీతి, నిజాయితీ లేని వ్యక్తి. తన తండ్రి ఖర్జూరనాయుడు వారసుడ్ని అని ఏ రోజూ చెప్పుకోలేదు. తన తల్లిని చివరి క్షణాల్లో కనీసం చూడని వ్యక్తి. ఆఖరికి తన తల్లిని కూడా ఆర్థిక అవసరాల కోసం.. లోకేశ్‌కు గిప్ట్‌ డీడ్‌ కోసం వాడుకున్నారు. 
► కరోనా నిర్ధారణ పరీక్షల్లో, సదుపాయాలు కల్పించడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. 
► నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియా సమావేశాలు.. జబర్దస్త్‌ కామెడీ షోలా ఉన్నాయి. ఆయన సమావేశాలు ఎందుకు పెడుతున్నారో.. ఆయనకే తెలియదు. 

Advertisement
Advertisement