మధుసూదన్‌ అరెస్ట్‌తో రంగంలోకి హరీష్‌.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత | Gudem Mahipal Reddy Serious Comments Over Congress Govt | Sakshi
Sakshi News home page

మంత్రి దామోదర ఆదేశాలతోనే బీఆర్‌ఎస్‌ నేతలపై టార్గెట్‌: హరీష్‌ రావు

Mar 15 2024 11:16 AM | Updated on Mar 15 2024 11:56 AM

Gudem Mahipal Reddy Serious Comments Over Congress Govt - Sakshi

సాక్షి, సంగారెడ్డి: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధుసూదన్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకోవడం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

ఇక, మధుసూదన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిపాల్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘దేశం మొత్తంలో ఎన్నో క్వారీలు ఉన్నాయి. పూర్తి పర్మిషన్‌తో క్వారీలు నడిపిస్తున్నాము. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదు. ప్రజా కోర్టులో తేల్చుకుంటాం. కింది స్థాయి నుంచి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నాము. మా తమ్ముడిని అక్రమంగా అరెస్ట్‌ చేశారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో కాంగ్రెస్‌ వంద రోజలు పాలన ఎలా తయారైందంటే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలి లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తారు. అక్రమ కేసులతో వేధిస్తున్నారు.  వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసం. అంత అవసరం ఏముంది?. నోటీసులు ఇవ్వరు.. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వలేదు. అధికారం శాశ్వతం కాదు. గత పదేళ్లలో మేము ఎప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదు. ప్రభుత్వం ఇలాంటి విధానాలను మార్చుకోవాలి. 

Video Credit: TeluguScibe

మంత్రి దామోదర  రాజనర్సింహ ఆదేశాలతో మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు. వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. వంద రోజులు పూర్తి అయ్యాయి.. హామీల అమలు పూర్తి కాలేదు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చివరకు ధర్మమే గెలుస్తుంది. కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము. మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజల మనసు గెలవండి. ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్ట్‌ కాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement