సాక్షి, విశాఖపట్నం: చేయనిది చెప్పుకోవడం.. వేరొకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్లో భాగంగా.. ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ పునాది నుంచి నిధుల కేటాయింపుల దాకా అప్పటి జగన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.
బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై స్పందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులను వైఎస్ జగన్ హయాంలోనే సాధించామని ధర్మాన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.
జగన్ ప్రభుత్వం వేసిన పునాదులే ఇవి
భోగాపురం ఎయిర్పోర్ట్ను తామే పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని ధర్మాన విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. "భోగాపురం ఎయిర్పోర్ట్కు జగన్ ప్రభుత్వం పునాది వేసింది. అవసరమైన అనుమతులు, సదుపాయాలు, నిధుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది" అని ధర్మాన పేర్కొన్నారు.
భోగాపురంపై కొనసాగుతున్న క్రెడిట్ ఫైట్
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టు వేగం పుంజుకుందని వైఎస్సార్సీపీ చెబుతుండగా.. కూటమి ప్రభుత్వం అదంతా తమ క్రెడిటేనంటూ సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం చేసుకుంటోంది.
కీలక వ్యాఖ్యలు
ఉత్తరాంధ్ర నిధులను అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడుతు పెడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజన వాదం బలపడే పరిస్థితులు వచ్చాయి. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.


