కేసీఆర్‌ ‘గ్రేటర్‌’ సభ లైవ్‌ ఆప్‌డేట్స్‌

GHMC Elections 2020: KCR Meeting Live Updates In Telugu - Sakshi

కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌ చాలా చైతన్యవంతమైన నగరం.ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి.భవిష్యత్‌ కోసం నాయకుడి ప్రణాళికలపై నిర్ణయం తీసుకోవాలి.అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది
  • అపోహలు, అనుమానాలపై సుదీర్ఘపోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం.కరెంట్‌ ఉండదు, నీళ్లు రావు, పరిశ్రమలు వెళ్లిపోతాయన్నారు.హైదరాబాద్‌ ఖాళీ అవుతుందని శాపాలు పెట్టారు.అయినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను విశ్వసించారు
  • హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డే. ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లాం. కరెంట్‌ సమస్యను పరిష్కరించాం.. 24 గంటలూ కరెంట్‌ ఇస్తున్నాం. ఏరోజు మేం పక్షపాత నిర్ణయాలు చేయలేదు. అంచనాలను మించి మిషన్‌ భగీరథను విజయవంతం చేశాం.
  • రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే నా లక్ష్యం. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశాం. 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేస్తాం. ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసింది. దీన్ని అపార్ట్‌మెంట్లకూ వర్తింపజేస్తాం.

  • కల్యాణలక్ష్మీ, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్‌ కిట్టు... సూపర్‌ హిట్టు. ప్రతి రైతుకు రైతు బీమా పథకాన్ని అందించాం. 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం.
  • సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.
  • కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం కోల్పోయినా..ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు.
  • హైదరాబాద్‌ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైన మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి.కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు
  • హైదరాబాద్‌లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోంది. అభివృద్ధిని కొనసాగించాలి.
  • మరోసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించండి. వరదల నుంచి హైదరాబాద్‌కు శాశ్వత విముక్తిని కలిగిస్తాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను తెస్తున్నాం.శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో సేవలను పొడిగిస్తాం.
  • గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తాం.హైదరాబాద్‌కు అందమైన మూసీని అందించే బాధ్యత నాది.
  • గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాం.ముష్కరులు, రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాం.తలకుమాసినవాడి మాటలను పట్టించుకోను.హైదరాబాద్‌ నగరం, రాష్ట్రం అభివృద్ధే నా లక్ష్యం.
  • ముంబైని 10 రోజులకుపైగా వరద ముంచెత్తింది. చెన్నైని 21 రోజులకుపైగా వరద ముంచెత్తింది.ఢిల్లీ, అహ్మదాబాద్‌లకు కూడా వరద ముప్పు తప్పలేదు.హైదరాబాద్‌ నగరానికి వరద కష్టం వస్తే...
  • మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల దగ్గరకే వెళ్లి సహాయక చర్యలు అందించారు.ఆ దృశ్యాలను చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి
  • ఇంటికి రూ.10వేల సహాయం అందించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నా.బీజేపీ, కాంగ్రెస్‌లు పరిపాలించే ఏ నగరంలోనూ ఆర్థికసాయం అందించలేదు
  • అయినా కిరికిరి పెడుతున్నారు నాకొడుకులు.. బాధతో ఈ మాట అంటున్నా
  • ఎన్నికల అయిపోయాక డిసెంబర్‌ 7 నుంచే అర్హులైనవారందరికీ రూ.10వేల వరదసాయం అందిస్తాం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభా వేదికకు చేరుకున్నారు. వేదికపైకి ఎక్కి ప్రజలను అభివాదం చేసి సీఎం కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీ నేతల తీవ్రవిమర్శల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
  • వరద సాయం కింద 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా?
  • సాయం చేయని కేంద్రం..  ఎన్నికలు అనగానే వరదలా కేంద్రమంత్రులు వస్తున్నారు. బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా?.ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ల పరిస్థితే సక్కగలేదు కానీ వచ్చి మనకు చెప్పుతారు.
  • కేసీఆర్‌ ఢిల్లీకి వస్తున్నాడని గజగజా వణుకుతున్నారు. ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు?
  • యూపీ సీఎం ఇక్కడి వచ్చి ప్రచారం చేస్తున్నారు. జీడీపీలో 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతాడు?
  • హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్‌ ఉంటాడు. టీపాస్‌ కావాలా?, కర్ఫ్యూ పాస్‌ కావాలో? బిల్డర్లు ఆలోచించుకోవాలి
  • హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి.ప్రగతిశీల ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి.
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలిపించి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి.

స్పందించాల్సిన అవసరం లేదు : కేటీఆర్‌
మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ బండి సంజయ్‌ మద్యంతర ఎన్నికల వ్యాఖలపై మాట్లాడుతూ.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పిచ్చోడి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
 

104 స్థానాల్లో గెలుస్తాం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జోస్యం చెప్పారు. సంక్షేమం, అభివృద్ధే తమ పార్టీని గెలిస్తాయాని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ పిచ్చి మాటలు మాట్లాతున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్సీ కవిత
ఎల్బీ స్టేడియలో జరిగే  కేసీఆర్‌ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ బస్సులో బయలు దేరారు.కవాడిగూడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఎల్బీ స్టేడియంకు ఆర్టీసీ బస్సులో ప్రజలతో బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత బస్సు స్టార్ట్ కావడానికి మోరాంచడంతో, ఆ ఆర్టీసీ బస్సు దిగి మరో ఆర్టీసీ బస్సులో సభకు బయలుదేరి వెళ్లారు

కేసీఆర్‌ సభకు భారీ బందోబస్త్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాసేపట్లో హాజరకానునున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య సభ జరగనుంది. కోవిడ్ నిబంధనల మధ్య సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని డివిజన్ల నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది. ఎల్బీ స్టేడియం మొత్తం గులాబీమయమైంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టారు. రాత్రి 8గంటల వరకు ఎల్బీస్టేడియం వద్ద వాహన రాకపోకలకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ సభలో సిఎం కేసీఆర్‌ ఆరేళ్లుగా హైదరాబాద్ లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించనున్నారు.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top