ముగ్గురికే పట్టం | Gaddam Vivek, Adluri Laxman, Vakiti Srihari into Telangana cabinet | Sakshi
Sakshi News home page

ముగ్గురికే పట్టం

Jun 9 2025 1:38 AM | Updated on Jun 9 2025 6:39 AM

Gaddam Vivek, Adluri Laxman, Vakiti Srihari into Telangana cabinet

మంత్రివర్గంలోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ 

దైవసాక్షిగా ప్రమాణం చేసిన ముగ్గురు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు 

సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసిన కార్యక్రమం.. 12:13–12:22 గంటల మధ్య ప్రమాణం 

ఎట్టకేలకు ఏడాదిన్నర తర్వాత కుదిరిన ముహూర్తం.. 15కు చేరిన కేబినెట్‌ సభ్యుల సంఖ్య 

ఇంకా మూడు బెర్తులు ఖాళీనే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్‌ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్‌ (మక్తల్‌)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. 

జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్‌ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్‌ ఇంగ్లిష్‌లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. 

నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ జి ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు, కేబినెట్‌ మంత్రులు గ్రూప్‌ ఫొటో దిగారు.  

రాజ్‌భవన్‌లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్‌  

మరో మూడు బెర్తులు ఖాళీగానే... 
కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మరో 11 మంది కేబినెట్‌లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. 



స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్‌ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్‌ 7న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్‌ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్‌లో తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement