ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ | Formation of Committees for BJP Parliament Elections | Sakshi
Sakshi News home page

ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ

Jan 3 2024 4:38 AM | Updated on Jan 3 2024 4:38 AM

Formation of Committees for BJP Parliament Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలకభేటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జాతీయ నేతలు తరుణ్‌చుగ్, సునీల్‌ బన్సల్‌లు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ నియామకంపై దృష్టి పెట్టనున్నారు.90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఖరారు చేయనున్నట్టు రాష్ట్రపార్టీవర్గాల సమాచారం.

లోక్‌సభ ఎన్నికల ముందు వరకు పార్టీపరంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి ?  ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి ? అనే అంశంపై ఐదారు కమిటీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పనిలోపనిగా జాతీయ నేతలు అభిప్రాయసేకరణ జరిపాక బీజేఎల్పీనేతను ఎన్నుకోవాల్సి ఉన్నందున, ఈ భేటీల సందర్భంగా ఈ ఎన్నిక జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీనేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు.  

ముందుగానే లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన : కిషన్‌రెడ్డి 
ఎంపీ టికెట్లకు సంబంధించి దరఖాస్తులేవీ స్వీకరించడం లేదని మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారు అనేది జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుందన్నారు. గతంతో పోల్చితే ముందుగానే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇప్పటికైతే నాలుగు సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ గ్యారంటీపై చర్చ జరగలేదన్నారు. వరంగల్‌ నుంచి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోటీచేస్తారనే దానిపై ఎలాంటి చర్చ కానీ, నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement