
సాక్షి, తూర్పుగోదావరి: థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం సమస్యను సరిదిద్ద లేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతుంది. అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా’’ అంటూ వేణు గుర్తు చేశారు.
‘‘ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు వండి వార్చారు. అబద్దాన్ని ప్రజలకు చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా, ప్రజలను ఆదుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎక్కడ రాజీ పడలేదు. ప్రతి పక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపి నిత్యం ఒక అబద్ధాన్ని వండివార్చేవారు. అప్పట్లో రాష్ట్రం అప్పులపాలు అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారు. అప్పులను కప్పి పుచ్చటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’’ అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తిరుమల లడ్డూపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు చేయలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై గతంలో తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మీ కేంద్రమంత్రే దానిని అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత ఇసుక స్కీమ్ కాదు.. స్కామ్. గోదావరిలో ఇసుక అక్రమ దారి అంటూ ఈనాడు పేపర్ లోనే ఐటం వచ్చింది. గోదావరిలో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ జరుగుతుంది. 80 డ్రెడ్జర్లతో పనిచేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు పనిచేస్తున్నట్టా లేనట్టా?
బోట్స్మెన్ సొసైటీలకు చెల్లించాల్సిన డబ్బులు యంత్రాలకు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ మొత్తం అధికార పార్టీ నేతల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది. ఆదాయం పెరిగింది. ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఆదాయం తగ్గింది. తప్పు ఎక్కడ జరుగుతుంది?. కేవలం ఏడాది కాలంలో లక్షా 59 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. ఇసుక, మద్యంపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజమండ్రి పరిధిలో గోదావరిలో 80 డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే మీ నాయకుల ప్రమేయం లేదా?. గోదావరి లో 80 డ్రెడ్జర్లతో జరుగుతున్న తవ్వకాలు వెనుక ఎవరున్నారు? స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడున్నా, విదేశాల్లో ఉన్నా.. ఇసుక వ్యవహారంపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు.