మేం ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాం: ఢిల్లీ సీఎం | Eviction Row: Delhi CM Atishi says We Live In People Hearts | Sakshi
Sakshi News home page

మేం ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాం: ఢిల్లీ సీఎం

Oct 10 2024 8:03 PM | Updated on Oct 10 2024 8:23 PM

Eviction Row: Delhi CM Atishi says We Live In People Hearts

ఢిల్లీ: తమ పార్టీని గెలిపించుకొని సీఎం పదవిని పొందే సత్తాలేక బీజేపీ ఢిల్లీ సీఎం నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అతిషి మండిపడ్డారు. ఆప్‌ నేతలు ప్రజల హృదయాల్లో నివసిస్తారని, బీజేపీ కోరుకుంటే ఆ బంగ్లాను వారే ఉంచుకోవచ్చని అన్నారు. సీఎం నివాసం విషయంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. 

ఆప్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోందని మండిపడ్డారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని అన్నారు.

‘‘ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేమని బీజేపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనప్పుడు.. బీజేపీ ‘ఆపరేషన్ కమలం'ను ఆశ్రయిస్తుంది. పార్టీ చేరని నేతలను జైల్లో పెడతారు. సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించుకోలేక ఇప్పుడు సీఎం నివాసాన్ని సీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలలో నివసించేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు. అవసరమైతే వీధుల్లోంచి పాలన చేస్తాం. బీజేపీ వాళ్లు బంగ్లాలో ఆనందించవచ్చు. మేము ప్రజల హృదయాలలో జీవిస్తున్నాం’’ అని అన్నారామె.

ఇక.. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్‌ నాయకురాలు అతిషికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడంపై వివాదం నెలికొంది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్‌ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్డు, నంబర్‌ 6 అధికారిక బంగ్లాలోకి అతిషి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తన అధికారాన్ని ఉపయోగించి అతిషికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది.

చదవండి: సీఎం అతిషి సామాన్లు పడేశారు.. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌పై ఆప్‌ ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement