సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలపై చర్చ జరగాల్సిందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఈ అంశంపై మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన క్రమంలో.. తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడికి బొత్స గట్టి కౌంటర్ ఇచ్చారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మనిషి ఎద్దులా పెరిగితే సరిపోదు.. బాష కూడా బాగుండాలి. సభలో ఎలా మాట్లాడాలో అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి. తోటి సభ్యులకు గౌరవం ఇచ్చి మాట్లాడాలి. డీఎస్సీ పై చర్చ జరగాలన్నదే మా డిమాండ్. లోకేశ్ రాజీనామా చేసి.. సీబీఐతో దర్యాప్తు జరిపించాల్సిందే అని అన్నారు.
‘‘ఎద్దులా పెరిగితే తెలితేటలు రావు. మాటలు మంచిగా రావాలి. ఎరువులు లేకుండా రైతులు ఎలా చనిపోతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను ఛైర్మన్ పరిశీలించాలి. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చిర్రెత్తుకుపోయిన అచ్చెన్నాయుడు.. కుర్చీలోంచి లేని బొత్స వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
దద్దమ్మ అనడం అన్పార్లమెంటరీనా? అంటూ అచ్చెన్న గట్టి గట్టిగా అరిచారు. క్షమాపణలు చెప్పమంటే చెబుతానని.. దానికే అంతలా రియాక్ట్ కావాలా? అంటూ బొత్సను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనగా.. చైర్మన్ మళ్లీ మండలిని వాయిదా వేశారు.
అంతకు ముందు.. డీఎస్సీ అక్రమాల పై సమాధానం చెప్పలేక మంత్రులు ఎదురుదాడికి దిగారు. పదేపదే వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను కించపరిచేలా మాట్లాడారు.


