TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం | Debate On Residential Schools In Telangana Assembly | Sakshi
Sakshi News home page

TG: గురుకులాలపై అసెంబ్లీలో మాటల యుద్ధం

Dec 18 2024 5:23 PM | Updated on Dec 18 2024 5:48 PM

Debate On Residential Schools In Telangana Assembly

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలోని గురుకులాల విద్యార్థుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం(డిసెంబర్‌18) హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ చర్చలో బీఆర్‌ఎస్‌ తరపున మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలోని గురుకులాల్లో వివిధ కారణాలతో విద్యార్థులు మరణించడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలా ఎంత మంది విద్యార్థుల చావులకు కారణమవుతారని ప్రశ్నించారు. వెంటనే గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

దీనికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అక్కడక్కడా గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్‌ ఘటనలు జరిగిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. తమ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల విద్యార్థులకు 40 శాతం డైట్‌ ఛార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 54 యంగ్‌ ఇండియా స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మంత్రి పొన్నం వర్సెస్‌ గంగుల

ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదని ఎదురుదాడి చేశారు.దీనికి గంగుల స్పందిస్తూ మొదటిసారి సభకు వచ్చిన వ్యక్తి తాను మాట్లాడుతుండగా అడ్డుకోవడం సరికాదన్నారు. 

దీనిపై పొన్నం అభ్యంతరం చెప్పారు. తాను ఎంపీగా పనిచేశానని, తనను మొదటిసారి సభ్యుడు అనడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. తాను డబ్బుల సంచులతో గెలిచేవాడని కాదని, హుస్నాబాద్‌కు పారిపోయి గెలవలేదన్నారు. సభ్యుడు తొలిసారి వచ్చినా ఎన్నిసార్లు వచ్చిన గౌరవం ఇవ్వాలని మరో మంత్రి శ్రీధర్‌బాబు గంగులకు సూచించారు.

గురుకులాల విషయమై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ గురుకులాలకు కనీసం భవనాలు కట్టలేకపోయిందని విమర్శించారు.గురుకులాల్లో ప్రతి పనిని పెండింగ్‌లో పెట్టిందన్నారు. తాము ఎప్పుడూ సామాన్యులవైపే ఉంటామని,గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement