
హైదరాబాద్: ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభపై కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హెచ్(వి హనుమంతరావు) విమర్శలు గుప్పించారు. అది బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ మీటింగే కానీ, అంతకు మించి ఏమీ లేదన్నారు. పార్టీలో ఉన్న వాళ్లు వెళ్లిపోతారేమో అని భయపడి సభ పెట్టారని, కేసీఆర్ డిక్టేటర్ పాలన చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారని వీహెచ్ మండిపడ్డారు.
‘తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయ్యిందా?, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రజలు కేసీఆర్ ని తిరస్కరించారు. ప్రగతి భవన్, సెక్రటరియేట్ కట్టాలనే మంచి ఆలోచన కేసీఆర్ కు వచ్చింది. . కానీ ప్రజలను ఎవ్వరినీ అక్కడికి రానివ్వలేదు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మహారాష్ట్ర వెళ్లి కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు.
హర్యానా, పంజాబ్ వెళ్లి డబ్బులు పంచి వచ్చారు కేసీఆర్. మీర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇలా కేసీఆర్ తప్పులు మీద తప్పులు చేశారు’ అని వీహెచ్ ఆరోపించారు. ఇక యూత్ కాంగ్రెస్ లో కేసీఆర్, చంద్రబాబులు తన దగ్గర పని చేసిన వారేనంటూ వీహెచ్ స్పష్టం చేశారు. అయితే వాళ్లకు అవకాశం వచ్చింది.. తనకు రాలేదని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు వీహెచ్.