ఆ ‘ప్రాజెక్టుల’ను మీ ఖాతాలో వేసుకుంటే ఎలా? | Congress Party Leader Batti Vikramarka On BRS Party | Sakshi
Sakshi News home page

ఆ ‘ప్రాజెక్టుల’ను మీ ఖాతాలో వేసుకుంటే ఎలా?

Feb 12 2023 2:58 AM | Updated on Feb 12 2023 8:58 AM

Congress Party Leader Batti Vikramarka On BRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో జూరాల, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తే, వాటి ద్వారా వచ్చే నీటిని తామే అందిస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెప్పుకోవటం ఏంటని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు కింద 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది, కానీ, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి చేయకుండానే నీళ్లు ఎలా ఇస్తున్నారో అర్థం కావటం లేదు.

భారీ ఎత్తున ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను జనం ముందుంచేందుకు మేం వెళ్తే అరెస్టు చేస్తారు. వేరే దేశాల నుంచి వచ్చేవారిని మాత్రం అనుమతిస్తారు. ఏంటీ దారుణం’’అంటూ ప్రభుత్వతీరును తప్పుపట్టారు. అందులోని లోపాలను జనం ముందుంచుతామన్న భయంతోనే తమను అరెస్టు చేశారని ఆరోపించారు. పద్దులపై చర్చలో భాగంగా శనివారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల వెనుక ఉన్న భూములు ముంపునకు గురై పంటనష్టం జరుగుతున్నందున సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కాంగ్రెస్‌ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తిచేసి నీరు అందిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముందుకు సాగటం లేదని, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేసేందుకు కేంద్రంతో పోరాడి నిధులు తేవాలని అన్నారు. 

ఎకరాకు రూ.24 లక్షలు ఇవ్వాలి
దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజీవ్‌ సాగర్, ఇందిరసాగర్‌ ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చి 8 ఏళ్లు అవుతున్నా పూర్తి కాలేదన్నారు. సీతమ్మ ప్రాజెక్టు భూ పరిహారం కింద కనీసం ఎకరాకు రూ. 24 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వం చేట్టిన రాయలసీమ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్‌ను ఎప్పుడు పూర్తి చేస్తారో, డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీళ్లు ఇస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.

మల్లన్న సాగర్‌ నుంచి సంగారెడ్డికి ఎప్పటిలోగా నీళ్లు ఇస్తారో చెప్పాలన్నారు. 1996 పోలీస్‌ బ్యాచ్‌లో కొందరికి పదోన్నతులు ఇచ్చి కొందరికి ఆపటానికి కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. హోంగార్డులకు పే స్కేల్‌ అమలు చేయాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement