ఇదీ సామాజిక న్యాయం | CM YS Jagan Pays Tribute To Dr YS Rajasekhara Reddy: andhra pradesh | Sakshi
Sakshi News home page

ఇదీ సామాజిక న్యాయం

Mar 17 2024 4:51 AM | Updated on Mar 17 2024 8:04 AM

CM YS Jagan Pays Tribute To Dr YS Rajasekhara Reddy: andhra pradesh - Sakshi

వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చేతల్లో చూపిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

అభ్యర్థుల ప్రకటన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ 

ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు

మహిళా సాధికారతకు బాసట 

నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు

50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే

బీసీలకు 48 ఎమ్మెల్యే, 11 ఎంపీ స్థానాలు

7 సీట్లు ముస్లిం మైనార్టీలకు కేటాయింపు 

12 శాతం సీట్లు మహిళలకు కేటాయింపు

77 శాతం అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు

ఈ మార్పులన్నింటి వల్ల 2–3 నెలల్లో మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం 

సాక్షి ప్రతినిధి, కడప: సామాజిక న్యాయం అనేది మాటలకే పరిమితం కాదని, మొట్టమొదటిసారిగా సాధ్యమే అని ఆచరించి చూపిన చరిత్ర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌లో శనివారం దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యుడు నందిగం సురేష్‌ ఎంపీ అభ్యర్థులను, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.

అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఒక్క అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం మినహా 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లు కేటాయించామని చెప్పారు. 50 శాతం సీట్లను కచ్చితంగా నా.. నా.. నా.. అని సంబోధిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కచ్చితంగా అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనదన్నారు. ఇది నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ అమలు చేశామని చెప్పారు. దాన్ని మనస్ఫూర్తిగా... స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ రోజు 50 శాతం అంటే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్ధానాలు.. మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాల్లో ఈ వర్గాల వారికే సీట్లు ఇవ్వగలగడం చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని ఘట్టం అని తెలిపారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఆ ధైర్యం 
ఈ ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ స్థానాల్లో మార్పులు చేశాం. దాదాపు 99 స్థానాలు అంటే  50 శాతం స్థానాల్లో మార్పులు చేశాం. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఘట్టమే. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికీ ఉండకపోవచ్చేమో. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఈ ధైర్యం ఉందని, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టికెట్‌ రాని వాళ్లందరికీ సముచిత స్థానం ఇస్తూ ఏదో ఒక రూపంలో దగ్గరకు తీసుకునే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్నా. 

విప్లవాత్మక మార్పులు..
కనీవినీ ఎరుగని విప్లవాత్మక మార్పులతో ఐదేళ్ల పాలన సాగింది. రూ.2.70 లక్షల కోట్లు నేరుగా బట¯Œన్‌ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లింది. ఇలా రాష్ట్ర చరిత్రలో ఇదివరకె­న్నడూ చూడలేదు. ఎప్పుడూ జరగని ఘట్టం. లంచాలు లేకుండా ఇవ్వడం సాధ్యమేనా? వివక్ష లేకుండా ఇవ్వగలుగుతారా? అనే పరిస్థితి నుంచి.. ఇది సాధ్యమే అని ఐదేళ్ల పరిపాలనలో చూపించాం. గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలు, 50–60 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్థ తీసుకుని రావడం, వీటన్నిటి ద్వారా పారదర్శకత, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెయ్యడం అనేది దేశ చరిత్రలో సువ­ర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయంగా గుర్తుండి పోతుంది.

గ్రామాలు మారాయి, గ్రామాల్లో పరిస్థి­తులు మారాయి, స్కూళ్లు, ఆస్పత్రులు బాగుప­డ్డాయి.. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయం బాగు పడింది. మహిళా సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయం అన్నది మాటలకు కాదు.. మొట్టమొదటిసారిగా సాధ్యమే అని చేసి చూపించిన ప్రభుత్వంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబడగలిగిందని చెప్పడానికి గర్వపడుతున్నా. వీటన్నింటి వల్ల ప్రస్ఫుటమైన మార్పులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నింటి వల్ల దేవుడి ఆశీస్సులతో మళ్లీ 2–3 నెలల్లో కచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈ సందర్భంగా సామాజిక న్యాయం అన్నది ఇంకా గొప్ప స్థాయిలోకి తీసుకుపోయేలా అడుగులు వేస్తాం. 

59 స్థానాలు బీసీ అభ్యర్థులకే.. 
మొత్తం 200 స్థానాల్లో ఏకంగా 59 స్థానాలు బీసీలకే కేటాయించాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అ­సెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానా­లకు 11 స్థానాలు వీరికి కేటాయించాం. మహి­ళలకు ఇంతకు ముందుకన్నా బెటర్‌గా చేశాం. ఇది కూడా నాకు సంతృప్తిని కలిగించడం లేదు. వచ్చే ఎన్నికలకి ఇంకా వేగంగా అడుగులు వేయించే కా­ర్యక్రమం చేస్తున్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12 శాతం అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. ఇది పూర్తిగా సంతృప్తి కలిగించే అంశం కాకపో­యినప్పటికీ లాస్ట్‌ టైమ్‌ కన్నా బెటర్‌గా చేశాం. బహుశా ఏ ఇతర పార్టీ కన్నా బెటర్‌గానే ఉంటుందనుకుంటున్నాం.

గతంలో 19 సీట్లు ఇస్తే ఈసారి 24దాకా తీసుకుపోగలిగాం. ఇది కూడా ఒక విశేషమే. వచ్చే ఎన్ని­కలకి ఇంకా పెద్ద సంఖ్యలో ఇచ్చే­లా అడుగులు ముందుకు వేస్తాం. ఇవాళ విడుదల చేసిన జాబితా 200 మందిలో 77 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు.. గ్రాడ్యు­యే­ట్లు, ఆపై చదువులు చదివిన వారు. ఎమ్మెల్యే­లకు సంబంధించి 175 మందిలో 75 శాతం గ్రాడ్యు­యేట్లు, ఆపై చదువులు చదివిన వారిని మనం ఎంపిక చేశాం. మైనార్టీలకు ఇంతకు ముందు 5 స్థానాలిస్తే ఇవాళ 7 స్థానాలకు పెంచగలిగాం. మొత్తం మీద 50 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకుంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement