ఢిల్లీ డిప్యూటీ సీఎం బ్యాంక్ లాకర్ వెతికిన సీబీఐ

CBI Officials Checked Manish Sisodia Bank Locker - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు సీబీఐ అధికారులు. లిక్కర్ పాలసీలో అవినీతి కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం గాజీయాబాద్‌లోని బ్యాంకులో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సిసోడియాతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్న విచారణలో తనకు క్లీన్‌చిట్ లభించిందని సిసోడియా అన్నారు. సీబీఐ అధికారులకు తన లాకర్‌లో కూడా ఏమీ దొరకలేదని చెప్పుకొచ్చారు. 

సీబీఐ తనిఖీల నేపథ్యంలో సోమవారమే ఈ విషయంపై ట్వీట్ చేశారు సిసోడియా. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలు తనిఖీలు నిర్వహించినప్పుడు సీబీఐకి ఎలాంటి అధారాలు లభించలేదని గుర్తు చేశారు. బ్యాంకు లాకర్లో వెతికినా ఏమీ దొరకదని ముందుగానే చెప్పారు. తన కుటుంబసభ్యులమంతా అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా బ్యాంకు లాకర్‌ను కూడా చెక్ చేసింది.

అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. సిసోడియా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పింది.
చదవండి: మోదీపై కాంగ్రెస్‌ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top