హైదరాబాద్: తనకున్న భద్రతను తొలగించడంపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్నేత నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసే తన భద్రతను తొలగించాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకే తనకు భద్రతను తొలగించారన్నారు.
మావోయిస్టు, నక్సల్స్, ప్రభావితా ప్రాంతాల్లో పనిచేసినందుకు తనకు హోం శాఖ భద్రతను ఇచ్చిందని, రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి ఏం చేశాడని స్పెషల్ భద్రతను ఇచ్చారని ప్రశ్నించారు. తన భద్రతను తొలగించడంపై డీజీపీకి లేఖ రాశానన్నారు. తనకు ఎలాంటి హానీ జరిగినా సీఎం రేవంత్రెడ్డిదే బాధ్యత వహించాలన్నారు. భద్రతను తొలగించినంత మాత్రానా ప్రజా సమస్యలపై, కాంగ్రెస్, బీజేపీ దోపిడీలు పై ప్రశ్నించను అనుకోవడం వారి మూర్ఖత్వమని హెచ్చరించారు. .


