రేవంత్ అహంభావం వల్లే 15,000 కోట్ల భారం: కేటీఆర్‌ | BRS KTR Serious Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ అహంభావం వల్లే 15,000 కోట్ల భారం: కేటీఆర్‌

Sep 28 2025 9:52 AM | Updated on Sep 28 2025 12:02 PM

BRS KTR Serious Comments On Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌ ప్రభుత్వం చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ముఖ్యమంత్రి రేవంత్ అహంభావం వల్లే తెలంగాణకు 15,000 కోట్ల నష్టం అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎల్ అండ్‌ టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు అని అన్నారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రేవంత్ రెడ్డి చేతకానితనం మరియు మితిమీరిన అహంభావం కారణంగా రాష్ట్ర అభివృద్ధి గాడి తప్పింది. పౌరులపై మెట్రో రైల్వే ఎల్ అండ్ టి సంస్థ కోసం తీసుకుంటామన్న ప్రభుత్వం నిర్ణయం వలన రూ. 15,000 కోట్ల భారం పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం, అనవసరపు అహంభావం వల్ల తెలంగాణ అభివృద్ధిని  అడ్డుకుంటున్నారు. తన రియల్ ఎస్టేట్ అవసరాల కోసం, ఉనికిలో లేని ఫోర్త్‌ సిటీ వైపు మళ్లించే నెపంతో, ఏకపక్షంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌ను రద్దు చేశారు.

మేడిగడ్డ వద్ద అక్రమ కేసులు పెడతామని ఎల్&టీ వంటి భారీ కార్పొరేట్ సంస్థను బెదిరించారు. ఇది కేవలం తన రాజకీయ ప్రయోజనాలు, కమీషన్ల కోసమే. నేషనల్ టెలివిజన్‌ లోనే స్వయంగా ఎల్&టీ కంపెనీ సీఎఫ్‌ఓను జైల్లో పెట్టాల్సిందిగా పోలీసులను కోరానని గొప్పలు చెప్పుకున్నారు. ఎల్&టీ ప్రతిష్టను దిగజార్చి, సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నించారు. అయితే, తెలంగాణ ప్రజల్లాగా చేతకాని ముఖ్యమంత్రిని భరించాల్సిన అవసరం ఈ కంపెనీలకి లేకపోయింది. అందుకే వారు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నారు. సీఎం మితిమీరిన అహంభావం, గూండాగిరి కారణంగా రాష్ట్ర పన్ను చెల్లింపుదారులపై రూ. 15,000 కోట్ల అప్పు భారం పడనుంది.

ప్రభుత్వ చేతకానితనం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయింది, ఆరోగ్యశ్రీ పథకం స్తంభించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కినాయి. కానీ, కార్పొరేట్ కంపెనీ రుణాన్ని భరించేందుకు మాత్రం రేవంత్ రెడ్డికి నిధులు ఉన్నాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement