ప్రజాసమస్యలపై సంగ్రామం | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై సంగ్రామం

Published Mon, Dec 13 2021 3:02 AM

BJP Plans To Complete Praja Sangram Yatra In All Assembly Constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమతోంది. వచ్చే ఏడాది చివరకల్లా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికార టీఆర్‌ఎస్‌కు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని భావిస్తోంది.

‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని కోడ్‌ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార టీఆర్‌ఎస్‌ విధానాలపై ఉద్యమ కార్యాచరణను, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత పాదయాత్ర వంటి కార్యక్రమాలను బీజేపీ అనివార్యంగానే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నెల 16తో కోడ్‌ ముగుస్తుండడంతో.. తిరిగి కార్యాచరణపై దృష్టి పెట్టాలని భావిస్తోంది.

వానాకాలం ధాన్యం కొనుగోలు, పెట్రో ధరలపై రాష్ట్ర వ్యాట్‌ తగ్గింపు, పూరిస్థాయిలో దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ, నిరుద్యోగ భృతి అమలు వంటి వాటిపై మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పార్టీ నుంచి ముఖ్యనేత ఒకరు రెండోవిడత సంజయ్‌ పాదయాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర మొదలుపెట్టిన తర్వాత కనీసం 50 రోజులు కొనసాగించే ఆలోచనలో కమల దళం ఉంది. 

వ్యూహానికి మరింత పదును 
బండి సంజయ్‌ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, అధికారపార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. ప్రభుత్వ పెద్దలు, మంత్రులపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడం ద్వారా రాజకీయవేడిని పెంచు తూ ప్రజల దష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. తాజాగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భారీ విజయం సాధించడంతో,  ఇదే వ్యూహానికి మరింత పదును పెట్టి, దీర్ఘకాల కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టాలని నిర్ణ యించింది.

టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టా లని భావిస్తోంది. ఈటల గెలుపుతో పార్టీ కేడర్‌లో వచ్చిన నూతనోత్సాహాన్ని మరింత పటిష్టపరిచి సంస్థాగతంగా బలోపేతమయ్యేలా ముందుకెళ్లాల ని నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడేలా వివిధ కార్యక్రమాలతో మరింత ఉధృతంగా ముందుకెళ్లాలని, పకడ్బందీ వ్యూహంతో శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించింది.    

Advertisement
Advertisement