
న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు 'అరవిందర్ సింగ్ లవ్లీ' శనివారం బీజేపీలో చేరారు. ఈ సంఘటనపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపించారు.
సౌరభ్ భరద్వాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇండియా కూటమితో ఆప్ భాగస్వామి అయినప్పుడు, పొత్తుకు నిరసనగా ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ రాజీనామా చేశారు. ఆ సమయంలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని మేము ఊహించామని ఆయన అన్నారు.
ఇదంతా బీజేపీ రాజకీయం. భారతీయ జనతా పార్టీ.. ప్రతిపక్ష పార్టీలను విచ్చిన్నం చేస్తోంది. ఏది ఏమైనా ఇండియా కూటమి ఢిల్లీలో మొత్తం 7 సీట్లను గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అరవిందర్ సింగ్ లవ్లీ బీజేపీలో చేరిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా తర్వాత మద్దతుదారులను, అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలను కలిసినప్పుడు, ఇంట్లో కూర్చోవద్దని, ఢిల్లీ ప్రజల కోసం పోరాడటానికి బలమైన పార్టీలో చేరాలని తనను కోరినట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు.