‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు | Bandi Sanjay Hot Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 17 2025 4:48 PM | Updated on Feb 17 2025 5:22 PM

Bandi Sanjay Hot Comments On Congress Govt

సాక్షి,కరీంనగర్‌: కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..మేధావులారా.. బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి’ అంటూ బీజేపీ కేంద్రమంత్రి బండిసంజయ్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్‌రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది.

కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..నిరుద్యోగులకు 56 వేల నిరుద్యోగ భృతి.2 లక్షల ఉద్యోగాల బాకీ.. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ. ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ. ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ. మేధావులారా..బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి.

మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీదే. బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్‌తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. 

బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?’ అని బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement