ప్రాంతీయ చిచ్చుకు చంద్రబాబు కుట్ర

Anilkumar Yadav Comments On Chandrababu - Sakshi

ఎమ్మెల్యేల లేఖలే నిదర్శనం

వైఎస్సార్‌ వల్లే ఆ జిల్లాల్లో ప్రాజెక్టులు

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణకు చంద్రబాబు సరెండర్‌

రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేసిన బాబు

మంత్రి అనిల్‌కుమార్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో రాయలసీమ లిఫ్ట్‌ ఆపించాలంటూ లేఖ రాయించడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, ప్రసార మాధ్యమాల అధిపతులు  రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు రాష్ట్రానికి దెయ్యాల్లా దాపురించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఆ జిల్లాల అభివృద్ధికి వైఎస్సే కారణం
ప్రకాశం, గుంటూరు జిల్లాలను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎన్‌ఎస్‌పీ ఆధునికీకరణతో అభివృద్ధి చేశారు. వెలిగొండ ప్రాజెక్టును తీసుకొచ్చారు. గుండ్లకమ్మ రిజర్వాయర్, రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేశారు. కొర్సిపాడు లిఫ్ట్, సోమశిల నుంచి రాళ్లపాడుకు సామర్థ్యం పెంచడం వైఎస్సార్‌ కాలంలోనే జరిగాయి. ఈ జిల్లాలకు  చంద్రబాబు చేసిందేంటి? వెలిగొండ పనులు వైఎస్సార్‌ కాలంలో 11.5 కిలోమీటర్లు పూర్తయితే.. చంద్రబాబు ఐదేళ్లలో 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. జగన్‌ 18 నెలల్లోనే మొదటి టన్నెల్‌ను 2.8 కిలోమీటర్లు, రెండో టన్నల్‌ను కిలోమీటరుకుపైగా పూర్తిచేశారు.  రెండో టన్నెల్‌ను కూడా 2023లోగా పూర్తిచేసి నీరందించేందుకు కృషిచేస్తున్నారు. గోదావరి నుంచి నీరు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎన్‌ఎస్‌పీ కెనాల్‌కు పంపేందుకు ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చుచేశారు. 

భయపడి తెలంగాణతో బాబు రాజీ
తెలంగాణలో ఐదేళ్లలోనే  పాలమూరు రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టులు కట్టారు. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్న చంద్రబాబు తెలంగాణతో రాజీపడ్డాడు. అప్పట్లోనే చంద్రబాబు.. రాయలసీమ ఎత్తిపోతల ఆలోచన చేసి ఉంటే బాగుండేది కదా? పోతిరెడ్డిపాడులోంచి నీరు తీసుకెళ్తుంటే ఒకప్పుడు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ దగ్గర ధర్నా చేయించాడు. చిత్తూరు జిల్లాలో 3 రిజర్వాయర్లు కట్టి 8 నుంచి 10 టీఎంసీల నీరు నింపాలని వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తే.. రాజకీయభిక్ష పెట్టిన జిల్లాకే ప్రాజెక్టులు రాకుండా కేసులు వేయించి అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. 

ఇంత దుష్ప్రచారమా? 
లేటరైట్‌ను బాక్సైట్‌ అంటూ చంద్రబాబు చేస్తున్నదంతా దుష్ప్రచారమే. ఈ ప్రభుత్వం లేటరైట్‌కు ఒక్క పర్మిషన్‌ ఇవ్వలేదు. కేవలం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులనే అమలు చేసింది. 2015లో పర్యావరణ అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా ఆయన ఎందుకు అడ్డుకోలేదు? తన పార్టీ వ్యక్తి అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు గిరిజనుల పేరుతో మైన్‌లు తీసుకుని నడిపారు. వైఎస్‌ జగన్‌ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. నీటిహక్కు ఉన్నమేరే ప్రాజెక్టులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top