
సాక్షిఅమరావతి/వినుకొండ (నూజెండ్ల) : చంద్రబాబు నాయుడు తాను అధికారంలో లేకపోతే రాష్ట్రమంతా హింస చెలరేగాలని కోరుకుంటారని అది ఆయన నైజమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడితో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘వినుకొండలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా.
స్థానికులకు వాస్తవాలేంటో స్పష్టంగా తెలుసు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరపకపోయి ఉంటే అక్కడ ఘటన మరింత ఘోరంగా ఉండేది. ఇటీవల బ్రహ్మనాయుడు వల్లభ డెయిరీ పెట్టారు. ఈ ఫాం నిర్మాణం కోసం గోతులు తవ్వి, మట్టి బయటకు తీశారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేరే చోట నుంచి మట్టిని తరలిస్తున్నారంటూ జీవీ ఆంజనేయులు, టీడీపీ నేతలు యాగీ చేశారు. గోడలు దూకి బ్రహ్మనాయుడు స్థలంలోకి వెళ్లి ఫొటోలు తీసి సెల్ఫీ చాలెంజ్ చేశారు.
వాచ్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేయరా?. దానికి ధర్నా, ఊరేగింపు చేస్తూ ఈ గొడవకు ఆజ్యం పోశారు. బ్రహ్మనాయుడు జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే చుట్టూ మూగి కారుకు టీడీపీ జెండా కట్టారు. గన్మెన్లకు దెబ్బలు తగిలాయి. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఫ్రస్ట్రేషన్తో జీవీ అంజనేయులు ఈ దాడులు చేయించారు’ అని అన్నారు.
పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారు..
ఇటీవల చంద్రబాబు టీవీ సీరియల్ లాగా పోలవరం, వ్యవసాయం, రాయలసీమ పరిస్థితులపై పచ్చమీడియాలో సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారని, వ్యవసాయంపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి ధ్వజమెత్తారు. పోలవరాన్ని రామోజీరావు బంధువుదైన నవయుగ కంపెనీకి ధారాదత్తం చేసి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని దుయ్యబట్టారు.
14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు పట్టిన చంద్రబాబు అనే శనిని వైఎస్ రాజశేఖరరెడ్డి వదిలించారని, మరలా 2019లో వైఎస్ జగన్ ఇంటికి పంపారని అన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏపీలో 300 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కరువు మండలం కూడా లేదని వివరించారు. పల్నాడు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే వరికపూడిసెల ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు వచ్చాయని చెప్పారు.