చెన్నై: అన్నాడీఎంకేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఆరోగ్య మంత్రి, వైరాలిమలై ఎమ్మెల్యే సి విజయభాస్కర్ మంగళవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శాసనసభ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో విజయభాస్కర్ ఐదో వ్యక్తి. ఆయన రాజీనామాతో సభలో పార్టీ బలం 42కు తగ్గింది.
సచివాలయంలో శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్కు ఆయన తన రాజీనామా పత్రం సమర్పించారు. విజయభాస్కర్ రాజీనామాను ఆమోదించినట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయభాస్కర్ పుదుక్కొట్టై జిల్లాలోని వైరాలిమలై నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
ఇటీవలే విజయభాస్కర్ అన్నాడీఎంకే నాయకత్వంపై విమర్శలు చేశారు. భావోద్వేగాలకు గౌరవం ఇవ్వని పార్టీలో తాను ఎలా కొనసాగగలనని ప్రశ్నించారు. "నాయకత్వం అంటే అధికారం లేదా అహంకారం కాదు. అంకితభావాన్ని హృదయపూర్వకంగా అర్థం చేసుకోవడమే నాయకత్వం" అని విజయభాస్కర్ ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, పన్నీర్సెల్వం, కె.పళనిస్వామి నాయకత్వంలోని మంత్రివర్గాల్లో విజయభాస్కర్ 2013 నుంచి 2021 వరకు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.


