కోల్సిటీ: రామగుండం బల్దియాలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 45వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కౌటం సతీశ్ కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తన డివిజన్లో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాల సమస్యలపై కమిషనర్ అరుణశ్రీకు వివరించేందుకు యత్నించగా స్పందించలేడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు సాగి సంతోష్రావు, దొంత శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య, కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ల భర్తలు మడిపల్లి మల్లేశ్, పాతిపెల్లి రవి, 45వ డివిజన్ అధ్యక్షుడు కొమురయ్య, సీపీఐ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. సతీశ్ మాట్లాడుతూ, తన స్లమ్ డివిజన్కు కూడా ప్రాధాన్యత కల్పించి విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని గతంలోనే కమిషనర్కు వినతిపత్రం అందజేశానన్నారు. మరోసారి విన్నవిస్తే కమిషనర్ పట్టించుకోలేదని ఆరోపించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య జోక్యం చేసుకొన్నారు. కమిషనర్తో మాట్లాడి కార్పొరేటర్ల సమక్షంలో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేటర్ ఆరోపణల గురించి కమిషనర్ అరుణశ్రీని వివరణ కోరగా.. తర్వాత తెలియజేస్తామన్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లు, నాయకులు బల్దియాలో నిరసనకు దిగడం చర్చనీయాంశంగా మారింది.
బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్
విద్యుత్ సమస్యలపై స్పందించలేదంటూ ఆగ్రహం


