జీఎస్‌టీ బకాయిలపై కేంద్రం దృష్టి | - | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బకాయిలపై కేంద్రం దృష్టి

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

● కాంట్రాక్టర్ల బిల్లులు, జీఎస్‌టీ చెల్లింపులపై ఆరా ● బకాయిలు స్వచ్ఛందంగా చెల్లించాలని అధికారుల ముందస్తు సూచనలు?

జ్యోతినగర్‌: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేస్తున్న కొందరు కాంట్రాక్టర్ల జీఎస్‌టీ చెల్లింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చెల్లించిన, ఇంకా చెల్లించాల్సిన బిల్లుల్లో పేర్కొన్న జీఎస్‌టీ, రిటర్న్‌లు, పన్ను చెల్లింపుల వివరాలపై కేంద్ర జీఎస్‌టీ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. పలు ప్రాజెక్టుల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెయింటెనెన్స్‌ తదితర విభాగాల్లో అనేకకాంట్రాక్టు సంస్థలు పనులు నిర్వహిస్తున్నా యి. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు సమర్పించే బిల్లు ల్లో జీఎస్‌టీ కీలక అంశంగా ఉంటుంది. పనుల విలువ, వ ర్తించే పన్నురేటు, జీఎస్‌టీ ఇన్వాయిస్‌లు, రిటర్న్‌ల దాఖలు, పన్ను చెల్లింపుల వివరాలను రికార్డులతో సరిపోల్చే ప్రక్రియపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

అసంపూర్తి పనుల బిల్లులపై అనుమానాలు

కొన్నిపనులు పూర్తిస్థాయిలో పూర్తికాకముందే బిల్లింగ్‌ ప్రక్రియలో జీఎస్‌టీ చూపించినట్లు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఅంశాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సిన ఉంది. వాస్తవంగా పనులు ఏ మేరకు పూర్తయ్యా యి, బిల్లులు ఏ ప్రాతిపదికన తయారయ్యాయి, అందులో జీఎస్టీ ఎలా లెక్కించారనే అంశాలను పరిశీలించిన తర్వాతే వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సమన్వయం కీలకం

కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరయ్యే సమయంలో చూపించిన జీఎస్‌టీ మొత్తానికి, సంబంధిత కాంట్రాక్టర్‌ ప్రభుత్వానికి చెల్లించిన పన్నుకు మధ్య వ్యత్యాసం ఉంటే అది అధికారుల పరిశీలనకు కారణమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీ ఎస్‌టీ ఇన్వాయిస్‌లు, రిటర్న్‌లు, పన్ను చెల్లింపు వివరాలు, ప్రాజెక్టు బిల్లులు, అకౌంటింగ్‌ రికార్డులను పరిశీలించడం ద్వారా బకాయిలు ఉన్నాయా? లేదా అనేది నిర్ధారించవచ్చు.

ముందస్తు హెచ్చరికలు ఎందుకు?

బకాయిలు ఉన్నట్లు గుర్తించిన సందర్భాల్లో కాంట్రాక్టర్లు స్వచ్ఛందంగా పన్ను బకాయిలను చెల్లించి వ్యవహారాన్ని సరిచేసుకోవాలని అధికారులు ముందస్తుగా సూచిస్తున్నట్లు సమాచారం. నోటీసులు, వడ్డీ, వర్తించే ఇతర చట్టపరమైన చర్యల వరకు వ్యవహారం వెళ్లకుండా ముందుగానే బకాయిలను సరిచేసుకోవాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరెవరికి వర్తిస్తుందనే దానిపై స్పష్టత రావాలి

ఈ వ్యవహారం ప్రాజెక్టుల్లో ఎంతమంది కాంట్రాక్టర్లకు సంబంధించినది? ఎంత మొత్తంలో జీఎస్‌టీ బకాయిలు ఉన్నాయనే అంశంపై ప్రస్తుతం అధికారిక గణాంకాలు బయటకు రాలేదు. అలాగే అసంపూర్తి పనులకు సంబంధించిన బిల్లుల్లో జీఎస్‌టీ చూపించిన అంశంపై కూడా అధికారిక నిర్ధారణ వెలువడలేదు.

విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి

జీఎస్టీ చట్టం ప్రకారం పన్ను చెల్లింపులు, రిటర్న్‌ల దాఖలు, ఇన్వాయిస్‌ నమోదు తదితర అంశాల్లో లోపాలు ఉన్నాయా? అనేది రికార్డుల పరిశీలన ద్వారానే నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం ఆధారంగా కాంట్రాక్టర్లపై తుది నిర్ధారణకు రావడం సరికాదని, అధికారికంగా వెల్లడించే వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది. కాంట్రాక్టు బిల్లులు, వాటిలో చూపిన జీఎస్‌టీ, వాస్తవ పన్ను చెల్లింపులపై పూర్తిస్థాయి స్పష్టత వస్తే ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement