పెద్దపల్లి: కిశోర బాలికలను క్యాన్సర్ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం జిల్లాలో లక్ష్యానికి మించి కొనసాగుతోంది. డిసెంబర్ నాటికి జిల్లాలో 13–14 ఏళ్లు నిండిన విద్యార్థినులు 3,701 మంది ఉన్నట్లు గుర్తించి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈనెల 13 నాటికి 3,992 మందికి టీకాలు వేసినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అఽ దికారి డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. దీంతో 108 శాతం టీకా పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు.
కొత్తగా 291 మంది గుర్తింపు
13 ఏళ్లు దాటిన కిశోర బాలికలను గుర్తించి హెచ్పీవీ టీకా అందించడంలో భాగంగా ఈ నెలలో మరో 291 మందిని కొత్తగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ వైరస్ నుంచి ముందస్తు రక్షణ కల్పించేందుకు టీకాను అందిస్తున్నారు. గత మార్చి నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు 17 పీహెచ్సీలు, 4 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో అర్హులైన విద్యార్థులకు టీకాలు వేస్తున్నారు.
సిబ్బంది, అధికారుల సహకారంతో..
జిల్లాలో ఎప్పటికప్పుడు 14 ఏళ్లు నిండిన విద్యార్థులను గుర్తించి టీకాలు వేస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఈ టీకా దోహదపడుతుంది. సిబ్బంది, అధికారుల సహకారంతో లక్ష్యానికి మించి టీకాలు పంపిణీ చేశాం.
– కిరణ్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
జిల్లాలో 108 శాతం పూర్తి
3,701 మందికి గాను 3,992 మందికి వ్యాక్సిన్


