పెద్దపల్లి: అకడమిక్ ప్యానల్ సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన అకడమిక్ సహకారం అందిస్తూ, పాఠశాలల్లో నిరంతర విద్యాభివృద్ధికి దోహదపడేలా ఉండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రంలోని అన్ని మండలాల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కోసం నిర్వహించిన ఒకరోజు శిక్షణ, అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అకడమిక్ ప్యానల్ విధానంపై రాష్ట్రస్థాయి అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో బోధన, అభ్యసన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఉపాధ్యాయులకు ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానం నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. అకడమిక్ ప్యానల్ సందర్శనల ద్వారా ఉపాధ్యాయుల్లో భయాన్ని కలిగించకుండా, వారి బోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ మానిటరింగ్ను మరింత సమగ్రంగా అమలు చేసేందుకు పెద్దపల్లి జిల్లాలోని ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


