సాక్షి పెద్దపల్లి:
మీకు తల నొప్పివస్తుందా? జ్వరం ఉందా? కడుపు, ఒళ్లు నొప్పులతో భరించలేకుండా ఉ న్నారా? నిద్ర పట్టడం లేదా? ఏం భయం లేదు.. అనారోగ్య సమస్యలపై డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేదు. సమస్యగ గురించి చెబితే చాలు మెడికల్ షాపుల్లో అన్నిరకాల మందులూ ఇస్తారు. ఎంత మొత్తంలో కావాలన్నా ఇస్తారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. ఏ మందు వేసుకోవాలో, రోజుకు ఎన్ని వేసుకోవాలో, ఎన్ని రోజులు వాడాలో కూడా మెడికల్ షాపుల నిర్వాహకులే చెప్పేస్తారు. ఇలా జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. అప్పుడప్పుడు తని ఖీలు చేయడం, నామమాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం సంబంధిత శాఖ అధికారులకు పరిపాటిగా మారింది.
వైద్యుల చీటీ ఉంటేనే..
నిబంధనల ప్రకారం వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు ఇవ్వాలి. చాలామంది నిబంధనలు పాటించడం లేదు. జ్వరం, జలుబు, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఒంటినొప్పులు తదితర సమస్యలకు మెడికల్ షాపుల్లో అడగ్గానే మందలిస్తున్నారు. కార్డియాలజీ, సైక్రి యాట్రిక్, న్యూరాలజీ, యూరాలజీ, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ తదితర సమస్యలకు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు లు ఇవ్వకూడదు. ఈ వ్యాధుల ఔషధాల్లో హైడోస్, లోడోస్ అనే రకాలు ఉంటాయి. వ్యాధితీవ్రత, పే షెంట్ వయసు, శరీరతత్వం తదితరాలను బట్టి డాక్టర్లు మెడిసిన్ నిర్ణయిస్తారు. సాధారణంగా మెడికల్ షాపులకు వెళ్లి అడిగితే ఏ రోగానికై నా, ఎన్ని మందులు కావాలన్నా ఇచ్చేస్తున్నారు. ఆల్కహాల్, ఇతర మత్తు పదార్థాలకు బానిసైనవారు అవి దొర కని సమయాల్లో మెడికల్ సిరప్లు వాడుతున్నారు.
ఎక్స్పైర్డ్ మందులూ అమ్ముతున్నారు
డ్రగ్స్, కాలపరిమితి దాటిన, నకిలీ మందుల విక్రయాలూ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. డాక్టర్ రాసిన కంపెనీవి లేకుంటే వేరే కంపెనీ మందులు అంటగడుతున్నారు. జిల్లాలో సుమారు 500 వరకు రిటైల్, హోల్సేల్ మెడికల్ షాపులున్నాయి. రోజూ చిన్న, పెద్దదుకాణాల్లో రూ.3వేల నుంచి రూ.లక్ష వ్యాపారం జరుగుతోంది. డ్రగ్ఇన్స్పెక్టర్ల అడ్రెస్సే లేదు. అర్హత, అనుభవం లేనివారు ఫార్మసిస్ట్ సర్టిఫికెట్లతో మెడికల్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు.
లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిది
జిల్లాల్లో మందుల షాపులు బినామీలే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్నసిబ్బందితోనే షాప్లు నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్పై పరిజ్ఞానం లేనివారు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
మామూళ్ల మత్తులో..
డ్రగ్స్, కాస్మొటిక్స్ యాక్ట్ ప్రకారం ప్రతీ మెడికల్ షా పులో రిజిష్టర్డ్ ఫార్మసిస్టు ఉండాలి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ.. ఇలా ఏదోఒక ఫార్మసీ కోర్సు చేసినవారే షాపు నిర్వహించాలి. అనుమతిచ్చే సమయంలో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఫార్మాసిస్టు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలి. ఏరియా ఇన్స్పెక్టర్లు ఈ బాధ్యత నిర్వర్తించాలి. కానీ కొందరు ఏరియా ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పర్సంటేజీలు మాట్లాడుకొని..
జనరిక్, నాన్ జనరిక్ అనే తేడా లేకుండా నిర్వాహకులు ఔషధ కంపెనీలతో పర్సంటేజీలు మాట్లాడుకొని వైద్యులతో కుమ్మకై ్క ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై డ్రగ్ ఇన్స్పెక్టర్ను సంప్రదించగా తనిఖీలు చేస్తున్నామన్నారు. నిబంధనలు పాటించని మెడిక్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఔషధాల విక్రయాలు
ఫిజీషియన్ శాంపిళ్లు, కాలంచెల్లిన మందుల అమ్మకాలు
జిల్లావ్యాప్తంగా డ్రగ్ఇన్స్పెక్టర్ల నామమాత్రపు తనిఖీలు
షాపుల్లో బినామీల దందా కానరాని ఫార్మసిస్ట్లు


